భారత జ్యోతిష్య/ఖగోళ శాస్త్ర పితామహుడు:: వరహ మిహిరుడు



మనకు తెలియని ఎన్నో శాస్త్రాలను పరిచయం చేసారు.. ఆరోజుల్లో వారు చేసిన శాస్త్ర పరిశోధనలు ప్రస్తుతం ఎన్ని వందల డాక్టరేట్ లు ఇచ్చినా సరిపోవు.. వాటిలో మచ్చుకు కొన్నిటి పరిచయం.. ఈ టపాలో...
ఉజ్జయిని నగరానికి సమీపంలో క్రీ.శ 4 వ శతాబ్దంలో ఆదిత్యదాసుడనే జ్యోతిశ్శాస్త్ర పండితునకు జన్మించాడు మిహిరుడు. తండ్రి వద్ద గణిత జ్యోతిశ్శాస్త్రములు నేర్చుకున్న మిహిరుడు పాట్నా లో నాటి సుప్రసిద్ధ గణీత శాస్త్రవేత్త ఆర్యభట్టు ను కలుసుకొని ఆయనతో శాస్త్ర చర్చ జేశాడు. అనంతరము ఖగోళ, జ్యోతిష్య శాస్త్రాలను అధ్యయనం జేయాలని నిర్ణయించుకొని అసాధారణ కృషి సలిపారు. ఆయన నిరంతర అధ్యయన ఫలితాలు అతని గ్రంధాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
జలార్గళ శాస్త్రమంటే తెలుసా?? భూమ్మీద ఎక్కడెక్కడ నీరు దొరుతుందో తెలిపే శాస్త్రం. ఆయన రాసిన ‘బృహత్సంహిత’ లో ఈ జలార్గళ శాస్త్రం కేవలం ఒక అధ్యాయమట. అసలు గ్రంథం బృహత్సంహిత ఇంకెంత గొప్పగా ఉండేదో...
ఈ శాస్త్రంలో మనకు తటాకాలు/బావులు వగైరాలు ఎన్ని రకాలు? ఎలాంటి ‘లక్షణాలు’ ఉంటే తటాకం అంటారు? ఎలాంటి లక్షణాలు ఉంటే ‘పుష్కరిణి’ అంటారు? ‘కూపం’ అని ఎప్పుడంటారు? ఇలాంటివి చెప్పాక, నీరు ఎలా ఉన్నా కూడా ‘వంకమద్ది చెట్టు పట్టతుంగగడ్డలు, వట్టివేళ్ళు ఎండబెట్టి చూర్ణము చేసి అట్టి జలాశయములలో వైచిన అవి మధురజలంబులగును’ అనే పద్యం చూస్తే ఎలాంటి నీటినైనా సరే మధుర జలాలుగా మార్చవచ్చని తెలుస్తుంది.. నేటి మినరల్ వాటర్ సంస్కృతి ఏనాటి నుండో ఉండేదన్నమాట....!!
మానవుల శరీరంలో రక్త ప్రసరణకు రక్తనాడులు ఉన్నట్లే భూగర్భంలో నీటి ప్రవహం కోసం జలనాడులుంటాయనీ, అవి గుర్తించడానికి మామూలు మనుషులకి ఉపయుక్తమౌతుందని ఈ పుస్తకం రాసానని వరహమిహురుడు చెప్పాడు ఒక శ్లోకంలో. భూమ్మీదకి పడే నీరు ఒకే రంగు, రుచి కలదైనా, ఎక్కడ పడింది? అన్నదాన్ని బట్టి దాని రంగూ,రుచీ మారతాయి. కనుక, భూవిశేషముల గురించిన ఎరుకతో బావులు తవ్వాలి అని మిహిరుడి అభిప్రాయం. ఇక, జలనాడులు ఏవో, వాటిలో ప్రధానమైనవి, అధిక జలాలు కలిగేవీ ఏవో చెప్పారు.
తరువాత నుండి, ఎక్కువ నీరు ఉండే ప్రాంతాన్ని గుర్తించే సూచనలతో నిండింది పుస్తకం. ఉదాహరణకు:
శ్లో: “జంబూవృక్షస్య ప్రాగల్మీకో యధి భవేత్సమీవస్థః,
త్స్మాద్ధక్షిణపార్శ్వే సలిలం పురుష్వయే సాధు” (తొమ్మిదో శ్లోకం)
-అంటే నిర్జల ప్రదేశంలో ఉన్న నేరేడు చెట్టుకు తూర్పు దిక్కులో పుట్ట ఉంటే, దానికి దగ్గర్లో దక్షిణాన రెండు పురుష ప్రమాణములలోతు తవ్వితే అక్కడ అతి మధురమైన జలనాడి ఉంటుందట. (పురుష ప్రమాణము అంటే దాదాపు పది అడుగులంట)
ఇలా ఇతర చెట్ల కింద, లేదంటే ఇతర సందర్భాల్లో, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయో వివిధ శ్లోకాల్లో చెప్పారు. సగం పైగా ముగిశాక, ‘ఇప్పటి దాకా సారస్వత మహాముని చే చెప్పబడిన జలార్గళ శాస్త్రమును చెప్పితిని. ఇప్పుడు మనువుచే చెప్పబడిన జలార్గళ శాస్త్రమును చెప్తాను అని చెప్పి, మరి కొన్ని సూచనలు ఇచ్చారు. అలాగే, బావులు గట్రా తవ్వుతున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళు అడ్డం పడొచ్చు. వాటిని ఎలా పగులగొట్టాలో కూడా ఈ పుస్తకంలో చెప్పారు. అలాగే, చివరగా, చెరువులు ఎలా నిర్మిస్తే ఎక్కువ కాలం మన్నుతాయో, చెరువుల చుట్టూ ఎలాంటి వృక్షాలు పెంచాలో కూడా చెప్పారు. బావి తవ్వడానికి ఏ నక్షత్రాలు అనుకూలమో, ఏ దిక్కుల్లో తవ్వాలో కూడా చెప్పి ముగించారు. చివర్లో తవ్వడానికి ఉపయోగించవలసిన ‘జువ్వి పంగల పుల్ల’ ఎలాంటిది ఉండాలో చెప్పారు
ఈ అధ్యాయములోని విషయాలు అధారముగా ప్రస్తుతం వేగంగా పరిశోధనలు చేయుట జరుగుతుంది. భూగర్భ లోహం కనుక్కునేందుకు వరాహమిహిరుని సిద్ధాంతాలు ఉపయోగిస్తున్నారు. చెట్లు,ఆకులు పరిశీలించి వీటి అంచనాయే గాక, ఖనిజ సంపత్తిని అంచనా వేసే క్రొత్త శాస్త్రము ఈ అధ్యాయం ఆధారంగా ఉధ్బవించింది

No comments:

Post a Comment