కాలమే భగవత్‌ స్వరూపం -శ్రీ విష్ణు పురాణము

కనుక, ఈ నామరూపాత్మక ప్రపంచం అంతా, జరిగిపోయిన ప్రళయకాలంలో ప్రకృతిలో లీనమై ఉంటుంది. అదే ప్రాకృతసంచరమనే పేర వ్యవహృతమైనది. (ప్రకృతౌ సంస్థితం వ్యక్త మతీత ప్రళయేతుయత్! తస్మాత్ప్రాకృత సంజ్ఞోయ ముచ్యతే ప్రతిసంచరః)
కాలమే భగవంతుడు. దానికి ఆదీ - అంతం అనేవి లేవు. ఆగిపోవడం అనేది అసలే లేదు. అదొక నిరంతరాయ ప్రక్రియ. దీని లోపలి సృష్టి స్థితి లయాలు ఒక క్రమానికి అనుగుణంగా వర్తిస్తుంటాయి. ఈ కట్టుబాటు అరికట్టడం ఎవరికీ శక్యం కాదు.
మరి - సర్వంతర్యామి అయిన ఆ హరి, తన ఇచ్చానుసారం పురుషతత్త్వంలో సృష్టికాలంలో ప్రవేశిస్తాడు. అంటే జీవధాతువుల్లో నిక్లిప్తమైనట్టి (అవ్యయమైన) సామాన్యావస్థలోకి పరివర్తనం చెందుతాడు. ఇదొక వికాసరూపం అనదగినది. పంచతన్మాత్రలతో ఇది పునః పునః పరివర్తితమవుతూనే ఉంటుంది. అంటే - తనకు - 'ఇచ్చ' జనించినపుడు - ఆ విష్ణువే ఈ బ్రహ్మాండసృష్టి చేస్తాడు. కాని, కాలరూపుడైన భగవానుడు మాత్రం సదా స్థిరంగానే ఉంటాడు.
వికాసాణుస్వరూపైశ్చ బ్రహ్మరూపాదిబి స్తథా |
వ్యక్తస్వరూపశ్చతథావిష్ణుస్సర్వేశ్వరః ||
గుణసామ్యాత్తత స్తస్మాతేత్రజ్ఞాధిష్ఠితాన్మునే |
గుణవ్యఞ్జన సంభూతిస్సగకాలే ద్విజోత్తమ ||
ప్రధానతత్త్వముద్భూతంమహాంతం తత్సమావృణోత్‌ |
సాత్త్వికోరాజస శ్చైవ తామసశ్చత్రిధామహా
ప్రధానతత్వేన సమం త్వచాబీజమివావృతమ్‌ |
వైకారికస్తైజసశ్చ భూతాదిశ్చైవ తామసః ||
త్రివిధో యమహంకారో మహ త్తత్త్వాదజాయత |
భూతేన్ర్దియాణాం హేతు స్సత్రిగుణత్వా న్మహామునే ||
యథాప్రధానేనమహా మహతాసతథావృతః |
భూతాదిస్తు వికుర్వాణఃశబ్దతన్మాత్రకం తతః |
ససజశబ్దతన్మాత్రాదాకాశం శబ్దలక్షణమ్‌||
శబ్దమాత్రంతథాకాశంభూతాదిస్ససమావృణోత్‌ |
ఆకాశ స్తువికుర్వాణఃస్పశమాత్రంససజహ ||
బలవానభవద్వాయు స్తస్యస్పశో గుణోమతః |
ఆకాశంశబ్దమాత్రంతుస్పశమాత్రం సమావృణోత్‌||
తతోవాయు ర్వికుర్వాణోరూప మాత్రంససజ హ |
జ్యోతిరుత్పద్యతేవాయో స్తద్రూపగుణముచ్యతే ||
స్పశమాత్రస్తువై వాయూరూపమాత్రం సమావృణోత్‌ |
జ్యోతిశ్చాపివికుర్వాణంరసమాత్రంససజ హ ||
సంభవంతితతోంభాంసిరసాధారాణితానితు |
రసమాత్రాణిచాంభాంసిరూపమాత్రంసమావృణోత్‌ ||
వికుర్వాణానిచాంభాంసిగంధమాత్రంససజి రే |
సంఘాతోజాయతేతస్మాత్తస్యగంధోగుణోమతః ||
తస్మిం స్త స్మింశ్చతన్మాత్రంతేన తన్మాత్రతా స్మృతా |
తన్మాత్రా ణ్య విశేషాణి అవిశేషా స్తతో హితే ||
సృష్టిసమయంలో గుణాల ఆవిర్భావం అభివ్యక్తమౌతుంది. అంటే - ఏయే జీవులు ఎలా రూపొందాలో, వాటి ప్రధాన తత్త్వాలేమిటో నిర్దేశితమవుతాయి. ఆ ప్రధానతత్త్వాలన్నీ మహత్తత్త్వంలోంచి జనిస్తాయన్న మాట! ఆ మహత్తత్త్వమే బుద్ధి. ఇచ్చ + బుద్ధి = సృష్టి అని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. ఈ బుద్ధి అనేది రాజస, తామస, సాత్త్వికాలని మూడు భేదాలు. ఈ త్రిగుణాత్మక బుద్ధి భూతవికాశానికీ - ఇంద్రియాది వికారానికీ కారణం. దీన్నిబట్టి జగత్‌ప్రధాన వస్తువు చేత మహత్‌ (తత్త్వం), ఈ మహత్తత్వప్రేరణ చేత జగత్‌ ప్రధానం వృద్ధి చెంది పరస్పర ఆవృతమై శబ్ద తన్మాత్రగా పరిణతి చెందుతుంది. అంటే నాదం జనిస్తుంది. దీనికి మూలస్థానం ఆకాశం. అది వ్యాకృతమై స్పర్శకు ఆధారభూతమవుతుంది. అది మరో తన్మాత్రకు హేతువు. అదే గంథం. వాయురూపతన్మాత్ర. వాయువునుంచి జనించే మరోక తన్మాత్ర అగ్ని. ఈ తేజోరూపం రస తన్మాత్రకు మూలం. దీనివల్ల జలము ఉద్భవించింది. నీటివల్ల ప్రధానతన్మాత్ర రూపం ఏర్పడింది.
ఈ ప్రపంచతన్మాత్రలు (శబ్ద - స్పర్శ - రూప - రస - గంథాలు) ఒకదానికొకటి ప్రేరణవల్ల జనించి భూతభౌతికధారణ జరిగే ప్రక్రియగా స్థిరపడి వివిధ జీవరాశి ఉద్భవించింది. అయితే - ఏదీ ఒకదాని ప్రేరణ ఇంకోదానికి లేకుండా సృష్టివికాసం జరగదు.
ఈ బ్రహ్మాండం క్రమంగా ఒక నీటి బుడగలా పైకి లేచి, జలమంతటా ఆవరించింది. సృష్టికి పూర్వం అంతటా నీరే నిండిఉంది. అది బ్రహ్మరూపుడైన విష్ణుభగవానుని ఉన్నతమైన - ఉత్తమమైన ప్రాకృతస్థానం. (నారము అనగా నీరు. ఆయణుడు సంచారంచేత వ్యాపనశక్తి గలవాడు. నీటియందంతట వ్యాపించినవాడు గనుక 'నారాయణ' శబ్దవాచ్యుడు.)
యుగానుసారంగా ఈ కల్ప - వికల్పాలు ఉన్నంతవరకు సత్త్వగుణోపేతుడై ఈ సృష్టినంతటినీ రక్షిస్తాడు. కల్పాంతంలో రుద్రరూపుడై పరిసమాప్తి చేసి, తిరిగి బ్రహ్మరూపుడై పునఃసృష్టిచేస్తాడు.
ఆ హరియే సృజింపబడినవస్తువు. వివిధ అవస్థల చేత ఆయనే వరదుడు, వరేణ్యుడు. ఆయనయే సృజ్యుడు. సృజించబడే సర్వం. సమస్తం ఆ నారాయణుడే!

No comments:

Post a Comment