సువర్ణష్ఠీవి

ఒకనాడు సృంజయ మహారాజు కొలువు కిటకిటలాడుతోంది. ఎత్తయిన సింహాసనం మీద నారదమహర్షి కూర్చుని ఉన్నాడు. మహారాజుతో పాటు రాజపురోహితులందరూ ఆ మహర్షిని భక్తిశ్రద్ధలతో పూజించారు.
"మునీంద్రా! మహారాజు మీకు కావలసినవాడు. పైగా ధర్మపరుడు. నిరంతరం అన్నదానాలు చేస్తూ వుంటాడు. మీలాంటి పెద్దల అనుగ్రహం ఉండి కూడా ఆయన కోరిక తీరకపోవడం భావ్యమా?" అని ఒక బ్రాహ్మణుడు నారదుణ్ణి వినయంగా ప్రశ్నించాడు.
"ఆలాగా! ఆ సంగతి నాకు తెలీదు. మహారాజా! ఏమిటి మీ దిగులు! ఇన్నాళ్ళూ నాకు ఎందుకు చెప్పలేదు?" అని నారదుడు అడిగాడు.
"మహర్షీ! మరేం లేదు. గుణవంతుడూ, రూపవంతుడూ అయిన కొడుకు కావాలి నాకు" అన్నాడు సృంజయ మహారాజు.
"అంతే కదా!"
"అంతేకాదు స్వామీ! వాడి మలమూత్రాలు, చెమట, కన్నీళ్ళు, లాలాజలం అంతా బంగారం కావాలి. అలాంటి కొడుకు కావాలి. ఈ వరం నాకు ప్రసాదించండి"
నారదుడు అనుగ్రహించాడు.
సృంజయ మహారాజు పొంగిపోయాడు. సార్వభౌముడై భూమినంతటినీ ఏలుతున్నా సంతానం లేని దిగులు ఇన్నాళ్ళూ అయనను వేధించింది. ఇప్పుడది లేదు. మహాముని వరం వల్ల ఆ కోరిక కూడా తీరబోతోంది. రాజు పరమానందభరితుడయ్యాడు.
మహర్షి మాట ప్రకారం కొన్నాళ్ళకు కొడుకు పుట్టాడు. వాడికి 'సువర్ణష్ఠీవి' అని సృంజయుడు పేరు పెట్టాడు. అతి గారాబంగా వాడ్ని పెంచుకున్నాడు. వాడి వల్ల లభించే బంగారంతో కోట మొదలు పీట వరకూ అన్ని వస్తువులూ బంగారుమయం చేసి వైభవంగా ప్రకాశించాడు.
అలా కొంతకాలం గడిచింది.
ఒకరోజు కొందరు దొంగలు అంతఃపురంలో ప్రవేశించి సువర్ణష్ఠీవిని అపహరించుకుపోయారు. దూరంగా ఒక అడవికి తీసుకువెళ్ళి, అతని కడుపులో బంగారం ఉంటుందనుకొని వాడి పొట్ట చీల్చి చూశారు. మాంసం, ఎముకలు, నెత్తురు తప్పితే ఇంకేం కనిపించలేదు.
అందులో బంగారం లేకపోయేసరికి ఆ శవానక్కడే పారేసి వెళ్ళారు దొంగలు.
తెల్లవారాక సృంజయుడు కొడుకు కోసం అంతఃపురమంతా వెతికించాడు. కనిపించకపోయేసరికి కంగారుపడి నేల నాలుగు చెరగులకూ సేవకుల్ని పంపాడు. చివరకు అడవిలో కొడుకు శవంచూసి బావురుమని ఏడ్చాడు. మృతదేహానికి అంత్యక్రియలు జరిగాక కూడా వాణ్ణే తలుచుకుని కుమిలి కుమిలి రోదించసాగాడు.
సరిగ్గా అదే సమయంలో మళ్ళీ నారదులవారు వచ్చారు. "మహారాజా! నువ్వు ఏడిస్తే మాత్రం చనిపోయిన నీ కొడుకు ప్రాణంతో తిరిగి వస్తాడా? కాలాన్ని తప్పించుకోవాలనుకోవడం అవివేకం. గుణవంతుడు, రూపసి అయిన కొడుకును కోరుకున్నావు. బాగానే వుంది. అంతటితో ఆగక వాడేది ముట్టుకుంటే అది బంగారపు ముద్ద కావాలంటివి! మనిషికి ఆశ ఉండవచ్చు కాని పేరాశ వుండకూడదు. ఉంటే ఇదిగో ఫలితం ఇలాగే ఉంటుంది" అని ఓదారుస్తూనే దేవర్షి మెత్తగా మందలించాడు.
వైభవంగా రాజ్యాన్ని పాలించి, దానధర్మాలు చేసి, పుణ్యాత్ములుగా పేరుపొంది, దేవతల ఆశీస్సులందుకుని కూడా చిరంజీవులు కాలేకపోయిన మరుత్త మహారాజు, అంగరాజు, శిబిచక్రవర్తుల చరిత్రలు వివరించాడు. అ తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు గురించి, భగీరథుడి గురించి, శశిబిందుడి గురించి రకరకాల కథలు చెప్పాడు నారదుడు.
"మునీంద్రా! నువ్వు చెప్పిన కథలన్నీ విన్నాక నా పుత్రశోకం తగ్గింది. నీ దయవల్ల నా మనస్సు నిర్మలమయింది" అని సృంజయుడు నారదుడికి నమస్కరించాడు.
నారదుడు సంతోషించి, "నీకేం వరం కవాలో అడుగు ఇస్తాను" అన్నాడు.
"దేవా! నువ్వు ప్రసన్నుడవయ్యావు! ఇంతకంటే కావల్సిందేముంది నాకు?" అన్నాడు వినయంగా మహారాజు.
"సృంజయా! దొంగల మూర్ఖత్వానికి బలైపోయిన నీ కొడుకును మళ్ళీ నీకు తెచ్చి ఇస్తాను. శోకం మానెయ్యి" అన్నాడు నారదుడు.
ఆ దీవెనతో సువర్ణష్ఠీవి సజీవంగా చిరునవ్వు నవ్వుతూ కళ్ళెదుట కనిపించాడు. కొడుకుని చూసి బ్రహ్మానందపడిపోయాడు సృంజయుడు.
తర్వాత సువర్ణష్ఠీవి వివాహం చేసుకొని, సంతానవంతుడై భోగభాగ్యాలు అనుభవిస్తూ, యాగాలు చేస్తూ, దానాలు చేస్తూ చాలాకాలం సుఖంగా వున్నాడు.

No comments:

Post a Comment