గోత్రము , ప్రవర , వివాహ నిబంధనలు

గోత్రమంటే నిజానికి ’ గోశాల’ అని అర్థము. సనాతన కాలంలో ఒకే వంశానికి చెందిన వారంతా వారి వారి గోవులను ఒకేచోట ఉంచి కాపాడుకొనేవారు. ఆ ప్రదేశాన్ని ’ గోత్రము ’ అని పిలిచేవారు. కాల క్రమేణా ఆ పదానికి అర్థంమారి, ఒక వంశమువారి పూర్వీకులు పరంపరగా సంభవించిన మూలపురుషుడి ( ఋషి యొక్క) పేరునే వారి గోత్రముగా పిలవడము మొదలైంది.
ఒక గోత్రము వారంతా ఒకే వంశానికి చెందిన వారు అని అందరూ అనుకుంటారు. కానీ నాకు వ్యక్తిగతం గా తెలిసి ఒకే గోత్రపు వారు వివిధ వంశాలలో ఉన్నారు. అంతే కాదు, వివిధ వర్ణాలలో కూడా ఉన్నారు. ఇవి బ్రాహ్మణ గోత్రాలు , ఇవి క్షత్రియ గోత్రాలు , ఇవి వైశ్య గోత్రాలు ..... ఇలా ఉన్నప్పటి కీ , కొన్ని గోత్రాలు పరిపాటిగా అన్ని వంశాలలోనూ ఉన్నాయి. ఇలా గోత్రాలు అన్ని వర్ణాలలోనూ కలసి ఉండటానికి కింద రాసినది చదివితే కొంతవరకు బోధ పడవచ్చు...
సనాతనంగా వచ్చిన గోత్రాల మూల ఋషుల వివరాలు పరిశీలిస్తే, ఆ ఋషులు అచ్చంగా ఎనిమిది మందే ! విశ్వామిత్ర, జమదగ్ని, భారద్వాజ, గౌతమ, అత్రి, వశిష్ట, కశ్యప మరియు అగస్త్య ఋషుల పేర్లమీద ఆ యా గోత్రాలు ఏర్పడ్డాయి. తరువాతి కాలంలోలక్షల కొలది లెక్కలేనన్ని గోత్రాలు పుట్టుకొచ్చాయి. ఒక్కొక్క ఋషి పేరుతోనూ , ఇతర ఋషుల సంబంధాలతో , అనేక కలయికలు కలిగి , గోత్రాలు ఏర్పడ్డాయి. ఆ గోత్రజుల సంతానానికి , అదే గోత్రము. నాది పలానా ఋషి యొక్క గోత్రము అని చెప్పితే దానర్థం, పరంపరగా వచ్చిన ఆ ఋషి సంతానంలో ఎక్కడా వంశం ఆగిపోకుండా అఖండంగా వచ్చిన మగ సంతానంలో ఒకణ్ణి అని చెప్పడం అన్నమాట. ఆడపిల్లలు పుట్టితే, పెళ్ళయ్యాక, భర్త గోత్రమే వారి గోత్రమవుతుంది. సగోత్రులు అంటే, అబ్బాయి, అమ్మాయి ఒకేగోత్రము వారైతే, వారు ఒకే ఇంటివారు అయి, అన్నా చెళ్ళెళ్ళవుతారు కాబట్టి వివాహమాడరాదు.
కులము, గోత్రము తరువాత, వెంటనే వచ్చే మాట ’ ప్రవర ’. దీన్నే ’ ఆర్షేయ ’ అని కూడా అంటారు. దానర్థం, ప్రార్థిస్తూ ఆవాహన చేయడం. వ్యవహారికంగా ప్రవర అంటే , అగ్నిహోత్రమ్ చేసి, యజ్ఞము కాని, హోమము కానీ చేసే కర్త, తమ వంశములోని ప్రసిద్ధులైనవారి పేర్లను ఉటంకిస్తూ, ’ వారు చేసినట్టి హవనమే నేనూ చేస్తున్నాను, ’ అని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే ఆవాహన. ( అగ్ని స్తుతి ) సాధారణంగా అత్యంత ప్రసిద్ధులైన తన వంశములోని ముగ్గురి / లేదా ఐదుగురి / లేదా ఏడుగురి పేర్లను చెప్పాలి. సాధారణంగా ఆ ముగ్గురూ, తన గోత్రపు మూల ఋషికంటే సనాతనులై ఉంటారు. ఇది ఒక విధంగా తనని తాను పరిచయం చేసుకోవడానికి కూడా చెపుతారు. ఉపనయనము అయిన వటువు కొత్తగా వేదము, శాస్త్రాలు నేర్పించే గురువు వద్దకు వెళ్ళి మొదట ఈ ప్రవర చెప్పాలి. ఎవరైనా గురు తుల్యులు, గురువుగారి గురువుగారు, లేదా పెద్దవారిని మొదటి సారి కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రవర చెప్పాలి. ప్రవర చెప్పడానికి ప్రత్యేకమైన పద్దతి ఉంది. అది కింద ఇచ్చాను.

గౌతముడు , మరియు ఆపస్తంబుడి ప్రకారము , సగోత్రీయుల మధ్య వివాహాలు కుదరవు....చేసుకోకూడదు... ఎందుకంటే , ఒకే గోత్రములో పుట్టినవారు ఒకే ఇంటీ వారవుతారు. కాబట్టి వారు అన్నా చెల్లెళ్ళో , అక్కా తమ్ముళ్ళో, తంరీ కూతుళ్ళొ , తల్లీ కొడుకుల వరస కలవారొ అవుతారు...సగోత్రీకులంటే ఎవరు ? నిర్ణయ సింధువు ప్రకారము ,
ఏ రెండు కుటుంబాలకు గానీ " ప్రవర " పూర్తిగా కలిస్తే వారు సగోత్రీకులు అవుతారు. ప్రవర అంటే , కింద చెప్పినట్లు ,
|| చతుస్సాగర పర్యంతమ్ గోబ్రాహ్మణేభ్య శ్శుభం భవతు
---------------------- ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత
---- సగోత్రః , ----- సూత్రః, ----- శాఖాధ్యాయీ
.........................శర్మన్ అహం భో అభివాదయే ||
పైని ప్రవరలో , మన గోత్రము పేరు , గోత్ర ఋషుల పేర్లూ చెపుతాము. ప్రతి ఒక్కరూ , తమ గోత్రము ఏమిటో , తమ వంశ ఋషులు ఎవరో తెలుసుకొని ఉండాలి. కొన్ని వంశాలకు ఒకే ఋషి , మరి కొన్ని వంశాలకు ముగ్గురు ఋషులూ , కొన్నింటికి ఐదుగురు , మరి కొన్నింటికి ఏడుగురూ ఉంటారు. ఇంకా ఖాళీలలో , సూత్రః అని ఉన్న చోట తాము అనుసరించే సూత్రము ఏదో చెప్పాలి ( ఆపస్తంబ , బౌధాయన , కాత్యాయన ....ఇలా.. ) శాఖ అన్నచోట , తమ వంశపారంపర్యంగా అనుసరించే , అధ్యయనం చేసే వేదశాఖ పేరు చెప్పాలి ( యజు , రిక్ , సామ ... ఇలా ) శర్మన్ లేదా శర్మా అన్న చోట, బ్రాహ్మణులైతే తమపేరు చెప్పి శర్మా అని , క్షత్రియులైతే , వర్మా అని , వైశ్యులైతే గుప్తా అని చెప్పాలి.
బౌధాయనుల ప్రకారమైతే , సమాన గోత్రము లేక ' సగోత్రము ' అని నిర్ణయించడానికి కింది కొలమానము ఉపయోగించాలి.
మొదట , ఇద్దరి గోత్రమూ ఒకటే కావాలి. తర్వాత ,
* ఎవరికైతే ఒకడే ఋషి ఉంటాడో , అదే ఋషి ప్రవరలో గల కన్య తో వివాహము తగదు.
* ఎవరికైతే ముగ్గురు ఋషులు ఉంటారో , ఆ ముగ్గురిలో ఏ ఇద్దరైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.
* ఎవరికైతే ఐదుగురు ఋషులు ఉంటారో , ఆ ఐదుగురిలో ఏ ముగ్గురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.
* ఎవరికైతే ఏడుగురు ఋషులు ఉంటారో , ఆ ఏడుగురిలో ఏ ఐదుగురైనా ప్రవరలో గల కన్యతో వివాహము తగదు.
ఇదీ , సగోత్రము అవునా కాదా అని నిర్ణయించే పద్దతి. అంతటితో అయిపోలేదు... అవి కాక, ఇంకొన్ని కూడా చూడాలి..
మాతృ గోత్రాన్ని వర్జించాలి. అంటే , తల్లి పుట్టింటి గోత్రాన్ని కూడా పరిగణించి , ఆ ప్రకారముగా సగోత్రమైతే వివాహమాడరాదు.
ఏఎ గోత్రాలకు యే యే ప్రవరలు అన్నది చాలా పెద్ద చిట్టానే ఉన్నది... ఇక్కడ రాయడము వీలు పడదు.
ఇక నిబంధనల సడలింపులు
ఈ విషయములో సడలింపులు అంటు ఏవీ లేవు.
గోత్రము తెలియనిచో , తనని తాను ఎవరికో ఒకరికి ఇచ్చుకొని , వారి గోత్ర ప్రవరుడు కావాలి. తెలిసినచో , ఈ పద్దతి తగదు.
తెలిసి కానీ తెలియక కానీ సగోత్రీకులతో వివాహము జరిగి సంసారం చేస్తే , ప్రాయశ్చిత్తం చేసుకొని , ఆ కన్యని తల్లిలా ఆదరించాలి.
తెలిసి చేస్తే , గురు తల్ప వ్రతం చేసి , శుధ్ధుడై , ఆ భార్యని తల్లి లా ఆదరించాలి. ఆమెకు తానే ఆఖరి కొడుకు.
తెలియక చేస్తే , మూడు చాంద్రాయణ వ్రతాలు చెయ్యాలి.( చాంద్రాయణం అనగా , ఒక నెలలోని శుక్ల పక్షం లో మొదటి రోజు ఒక ముద్ద మాత్రమే అన్నం తినాలి. రెండో రోజు రెండు ముద్దలు , మూడో రోజు మూడు, ఇలా పౌర్ణమికి పదిహేను ముద్దలు మాత్రమే తినాలి. తర్వాత, కృష్ణ పక్షం లో ఒక్కో ముద్ద తగ్గిస్తూ తినాలి. అమావాశ్య కు పూర్తి ఉపవాసం ఉండాలి... ఇలా ఒక నెల చెస్తే అది ఒక చాంద్రాయణం. ) ఈ ప్రాయశ్చిత్తం తాను శుధ్ధుడవటానికి మాత్రమే... ఇది ఒక వెసులుబాటు కాదు.
Courtesy : Vibhata Mitra Garu

No comments:

Post a Comment