గోవు, గో సంబంధ విషయాలు మన ధర్మంలోనూ, వాజ్ఞ్మయంలోనూ, విశిష్టమైన పూజనీయత పొందటానికి కారణం ఏమిటి?

గోవు సాక్షాత్తు పరదేవతా స్వరూపం. ప్రధానంగా గోవు దేనికొరకు సృజింపబడింది అంటే ఆరాధనయందు కొన్ని పరిమితులుంటాయి. అందరూ అన్ని ఆరాధనలూ చేయలేరు. ఒక భక్తునికి భక్తి తీవ్రమైన స్థితిలో ఉండి అరటిపండును గోవుకు పెట్టారనుకోండి కామాక్షి దేవత చేయిచాచి ఆయన ఇచ్చిన అరటిపండు నోట్లో వేసుకుంటుంది. ఆయనతో మాట్లాడుతుంది. అలా మహాస్వామితో మాట్లాడింది. అలాగే కామకోటి పీఠ పరంపరలో ఎందరితోనో మాట్లాడింది. శృంగేరీ గురుపరంపరలో ఎందరో గురువులతో శారదమ్మ మాట్లాడుతుంది. కానీ నాకూ కోరిక ఉంటుంది - అమ్మవారికి నేను కూడా అరటిపండు తినిపించాలి అని. నాకు అంతస్థాయిలో ఉపాసన లేకపోవచ్చు. స్థాయితోటి, ఉపాసనా బలంతోటి, ఆశ్రమంతోటి, వర్ణంతోటి సంబంధంలేకుండా అందరూ ముట్టుకోవడానికి, అందరూ సేవించడానికి, అందరూ పెట్టడానికి యోగ్యమైనటువంటి పరదేవతా రూపంలో భూమిమీద తిరుగుతున్నటువంటి రూపమే గోవు. అలా ఇచ్చినప్పుడు నేను ఆ నోటిలో కామాక్షిని చూసినా చూడకపోయినా మనం పెట్టినది కామాక్షిపరదేవతకు స్వయంగా పెట్టినదే అవుతుంది. గోవు పృష్ఠ భాగానికి పసుపు రాసి బొట్టు పెడితే కామాక్షీ పాదములకు పసుపురాసి బొట్టు పెట్టినట్లు. గోవుమీద నీరు పోస్తే కామాక్షీ పరదేవతకు అభిషేకం చేసినట్లు. గోవుకి ఒళ్ళు రుద్దుకోవడానికి గరుకు స్తంభం వేస్తే అమ్మవారికి ఉపచారం చేసినట్లే. ఒళ్ళు రుద్దుకోవాలంటే తోక అందదు. గంగడోలుకి(మెడక్రింద భాగం) దురద. ఒక గరుకు స్తంభం ఉంటే దానికేసి రుద్దుకుంటుంది. వెంట్రుకలు క్రింద పడతాయి. ఎన్ని వెంట్రుకలు క్రింద పడ్డాయో పితృదేవతలని అన్ని వందల సంవత్సరములు స్వర్గలోకంలో పెడతారు. దాని రోమానికి కూడా అంత శక్తి.
గోసేవయే పరబ్రహ్మముయొక్క సేవ. గోవు లేనినాడు సనాతన ధర్మం లేదు. సనాతనధర్మం అగ్ని మీద ఆధారపడుతుంది. అగ్నిముఖంగా దేవతలకు హవిస్సు ఇస్తారు. అలా ఇవ్వాలంటే యాగశాలలో హోమగుండం కట్టాలి. అది కట్టడానికి భూమికి పవిత్రత ఉండాలి. భూమికి పవిత్రతను ఆవుపేడతో అలకి తెస్తారు. ఆవుపేడ వినా లోకములో పవిత్రతను తేవడానికి వేరొక పదార్థము లేదు. యేజీవి మలమూత్రములైనా దుర్వాసన. గోవుయొక్క మలము మాత్రం సువాసనతో ఉంటుంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వస్తే భూమిని గోమయంతో అలికి అమ్మవారిని పెట్టాలి. గోమయం ఉంటే భూశుద్ధి జరుగుతుంది. పంచ గవ్యాలు ప్రాసన చేస్తే లోపల ఉన్న పాపాలు కాలిపోతాయి. అందుకని గోవు, బ్రాహ్మణుడు ఎప్పుడూ శుభంగా ఉండాలి. అంటే అర్థం వాళ్ళిద్దరూ బాగుంటే అందరూ బాగుంటారు. 33కోట్ల దేవతలకు ప్రదక్షిణం చేయడం ఎప్పుడూ సాధ్యంకాని పని. గోవుచుట్టూ తిరిగారనుకోండి 33కోట్ల దేవతలకి ప్రదక్షిణ చేశారు అని ఖాతాలో వేసేస్తారు. అందుకే గోవులాంటి ప్రాణి లోకంలో లేదు. కొన్ని కొన్ని ప్రాణులయొక్క ధూళి మీద పడకూడదు. అపమృత్యు దోషం వస్తుంది. మేకల డెక్క మీదనుంచి రేగిన మట్టి మీద పడకూడదు. అదే గోవులు వెళ్ళిపోతున్నాయి అనుకోండి సాయంకాలం వేళ, గోధూళి పైకి లేచిందనుకోండి ఆ ధూళి మీద పడితే అదొక పవిత్రమైన స్నానం. అది మీద పడిన మాత్రం చేత వారు యేపవిత్ర కర్మ చేయడానికైనా యోగ్యత పొందుతారు. గోధూళివేళ అని కాలమునందు ప్రత్యేక ముహూర్తం గోవు డెక్కలనుంచి ధూళి పైకిరేగేటటువంటి సమయం. గోవు అంత గొప్ప ప్రాణి. అందుకే సనాతన ధర్మంలో గోవును రక్షించడం, కాపాడడం అంత గొప్పవి.
ఎంత గొప్పవో చెప్పాలంటే - కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు ఒక మారేడు చెట్టు దగ్గర వేసిన పాకలో ఉండేవారు. ప్రక్కన గోశాల ఉండేది. 97యేళ్ళ వయస్సు వచ్చింది ఆయనకి. ఆవు ఈనుతోంది. ఆసమయంలో చేటలో బియ్యం, బెల్లంగడ్డ పట్టుకొని వెళ్ళి ఆవుదగ్గర పెట్టి గోవు యొక్క పృష్ఠభాగమునుండి దూడ కొంతభాగము బయటికివస్తూ ఉండగా ప్రదక్షిణం చేసేవారు. అది భూప్రదక్షిణతో సమానం. గోశాల నిర్మాణం చేయడం, గోవుని కాపాడడం, గోవుకి సేవచేయడం, గోవుని పూజించడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుకి గ్రాసం పెట్టడం, గోవుకి గరుకు స్తంభం వేయడం, గోవుని నిమరడం, గంగడోలు దువ్వడం, గోవుని రక్షించడం, ఇవన్నీ పరమోత్కృష్టమైనటువంటి పుణ్యకార్యాలు. అందుకే పెద్దలొక మాట చెప్తారు అన్నిటికన్నా కష్టమేదీ అంటే అమ్మ వెళ్ళిపోవడం అని. అమ్మని చూడాలి అంటే ఆవుని చూస్తే చాలు. ఆవుపాలు తెచ్చుకొని త్రాగితే అమ్మచేత్తో చేసిన ప్రసాదం తినేసినట్లే. ఆవుకి అరటిపండు పెడితే ఆరోజు అమ్మ మనచేతి భోజనం చేసినట్లే. గోవుకు ప్రదక్షిణ చేస్తే అమ్మకు నమస్కారం చేసినట్లే. అందుకే పాలులేని పిల్లలకు ఆవుపాలు అంటారు. పశువుల నుంచి వచ్చేపాలు రజోగుణ, తమోగుణాలు కలిగిస్తాయి. సాత్త్వికమైన జీవనమున్నవారు జంతువుల పాలు పుచ్చుకోరు. కానీ సన్యాసాశ్రమంలో ఉన్నవారు కూడా ఆవుపాలు త్రాగుతారు. బుద్ధిని సత్వమునందు నిలబెడుతుంది ఆవుపాలు. అంతగొప్ప ప్రాణి ఆవు. అటువంటి గోవులు సర్వే సర్వత్రా కాపాడబడుగాక! అలా కాపాడబడడానికి కావలసిన సమస్తమైన శక్తులు భగవంతుడు మనకు అనుగ్రహించుగాక!

No comments:

Post a Comment