రామాయణం ఉత్తమమైన చారిత్రిక గ్రంథం

రామాయణం ఉత్తమమైన చారిత్రిక గ్రంథం. ఎవరికో తోచక వ్రాసిన కథనో లేక నవలనో కాదు. చతుర్ముఖ బ్రహ్మ యుద్దానంతరం జరిగిన సన్నివేశాలని జరిగినవి జరిగినట్లు తెలిసేలా వాల్మీకికి వరం ఇచ్చాడు. ఆదృష్టాన్ని వాడి వాల్మీకి "హసితం భాషితం చైవ గతిర్యాయశ్చ చేష్టితం" ఎవరు నవ్వినా, ఏమి మాట్లాడినా, కదలినా, ఏది అనుకున్నా, ప్రతి స్పందనని ఉన్నది ఉన్నట్టు చూసి జరిగినదాన్ని జరిగినట్లు వ్రాసాడు. అట్లా ఎలా సాధ్యం అని అనిపిస్తుంది, అంటే ఈ నాడు ఏదో చేయ్యి చూసి లేక పుట్టిన సమయం బట్టి జరిగిన విషయాలు చెప్పగలిగేవారు కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యం అవసరం లేదు. ఇలాంటి విషయాలని గుర్తించేప్పుడు మనకు తోచినట్లు కొన్నింటిని మనం మనకు ఊహిస్తుంటాం, పొరపాటు అక్కడే వస్తుంది.
ఒకసారి ఇంగ్లీషు దొరవారు ఒక గ్రామాన్ని పరిశీలన చేయడానికి వచ్చాడు, ఒక చాకలివాడు బట్టలు ఉతుకుతున్నాడు. ప్రక్కనే బట్టలని ఉడికిస్తూ, ఒక్కోటి తీసి బండకేసి కొడుతూ ఉతుకుతున్నాడు. ఇంగ్లీషు దొరవారు కొంతసేపు గమనించి ఒక నిర్ణయానికి వచ్చాడు, అసలు ఈ దేశం వారికి బుద్ది లేదు ఒక బండను పగలగొట్టాలంటే బట్టలతో కొడుతున్నారు, అట్లా పగలక పోతే ఆ బట్టను వేడి చెసి మరీ ప్రయత్నిస్తున్నారు అని తనకు తోచిన అవగాహనకి వచ్చేసాడు. అట్లానే సింధూలోయ నాగరికథని గూర్చి అట్లానే నిర్ణయించి చెప్పారు. సింధూ నది చుట్టు ప్రక్కన చిన్న చిన్న గొడలు కట్టి ఉంటాయి, వాటిని వారు వర్షపు నీరుని ఎక్కడికక్కడ నిలువ చేయడానికి కట్టినవి. కానీ వారు అవి ఆత్మ రక్షణకి ఏర్పాటు చేసుకున్న బంకర్లు అని తేల్చి చెప్పారు. పాశ్చాత్యులకి ఎప్పుడూ అవే ఆలోచనలు, ఎప్పుడు ఒకరిపై దాడిచేద్దామా అని. మన భారతీయమైన సంప్రదాయం అట్లా ఉండదు, అవసరమైతే ఒకరి సుఖం కోసం మన జీవితాన్ని ఇచ్చేసే మానవ మనస్తత్వం. రాక్షస ప్రవృత్తి కాదు. మన దేశంపై దాడి చేసి పాలించిన మొఘలాయీల విషయం తెలుసుకుంటే అర్థం అవుతుంది. రాజ్యం కొరకు తన సోదరుడిని చంపించడానికి వెనకాడలేదు ఔరంగజేబు.
శ్రీరామాయణం మానవత్వం అంటే ఎట్లా ఉండాలో అడుగడుగున నిరూపిస్తుంది. ఎవరెవరు ఏమేమి చేసారో అన్నీ పనులలో మానవత్వం పరిమళిస్తుంది. ఈ జాతికి ఎప్పుడూ ఆక్రమణలు కాదు, ఆనందం పంచడం కావాలి. ఒకరిది దోచుకోవడం కాదు, ఒకరికి ఆనందం ఎట్లా పంచాలో కావాలి. అయోధ్యకాండలో తండ్రి రామచంద్రునికి రాజ్యం ఇవ్వాలని అనుకున్నాడు కానీ తల్లి భరతునికి ఇవ్వాలని కోరింది. ఈ విషయం కైకమ్మ రామచంద్రునితో చెబుతుంటే, తండ్రిగారు అంత సంకోచించాల్సింది ఏముంది, ఇది చెప్పడానికి ఇందులో అంత సందేహించాల్సిన అవసరం ఏముంది కనక, రామా అడవికి వెళ్ళు అని ఒక్క మాట చెబితే చాలు, "రాజ్యంవా వనవాసోవా వనవాసో మహోదయః" నాకు రాజ్యమైతేనేమి వనవాసమైతేనేమి రెండూ తండ్రి గారివే అని సంతోషంతో వనానికి వెళ్తా అని రాముడు చెప్పాడు.
చిత్రకూటంలో ఉన్నప్పుడు భరతుడు తన వెంట లక్షల మంది సైన్యంతో రాముడిని వెతుకుతూ వస్తున్నాడు. అంత మంది వచ్చేసరికి అడవిలో జంతువులు, పక్షులు చెల్ల చెదురు అవుతున్నాయి. అది గమనించి ఎవరైనా వేటకు వచ్చారా లేక ఏదైన యాత్ర జరుగుతుందా అని రాముడు లక్ష్మణ స్వామిని చెట్టు ఎక్కి చూడమన్నాడు. లక్ష్మణుడు చెట్టు ఎక్కి ద్వజాన్ని చూసి ఇంకేముంది వనవాసం అయ్యాక తిరిగి రాజ్యం ఇవ్వడం ఇష్టంలేక మన పై దాడికి వచ్చాడు భరతుడు, ధనస్సును సిద్దం చేసుకో, సీతమ్మను దాచి పెట్టు అంటూ కేకలు వేసాడు. రాముడు లక్ష్మణుడితో భయం ఎందుకు అని అన్నాడు. ఒక దానిపై అత్యాశ పెంచుకున్నప్పుడు, దాన్ని దూరం చేస్తారేమోనని భయం వేస్తుంది కానీ అసలు ఆశ లేనప్పుడు భయం ఎక్కడ ఉంటుంది. భరతుని గురించి నాకు తెలుసు, ఒక వేల భరతునికి రాజ్యం కావాలనే ఆశ ఉంది అని నీవు అనుకుంటే ఒక పని చేస్తా, భరతుడు వచ్చాక నాతో పాటు వసవాసానికి భరతుడిని రమ్మంటా, నీవు వెళ్ళి రాజ్యాన్ని పాలించు అని చెప్పాడు. వెంటనే తల దించుకొని నోరు ఎత్తలేదు లక్ష్మణుడు. అయితే లక్ష్మణుడికి రాజ్యంపై ఆశ కాదు, రాముడిపై ప్రేమాతిశయం. మనం చుట్టూ ఉన్న వారితో ఎట్లా ప్రవర్తించాలో తెలుపుతుంది రామాయణం, అందుకే దాన్ని ఇతిహాస శ్రేష్టం అని అంటారు.

No comments:

Post a Comment