హనుమంతుని సాగర తరణం

హనుమంతుడు పర్వత సమానంగా దేహాన్ని పెంచి, సాగరాన్ని దాటడానికి సన్నద్ధుడై మహేంద్రగిరిపైకి ఎక్కాడు. సూర్యునికి, ఇంద్రునికి, బ్రహ్మకు, భూతకోటికి నమస్కరించాడు. పిక్కలు బిగబట్టి, చేతులు అదిమి, ఒక్కుదుటున లంఘించాడు. అ అదురుకు పర్వతం బీటలు వారింది. ఆకాశంలో మేఘంలా, విడచిన రామబాణంలా, హనుమంతుడు వేగంగా లంకవైపుకు వెళ్ళసాగాడు.

రామ కార్యానికి సహాయపడదలచి, దారిలో మైనాకుడనే పర్వతం తనపై విశ్రాంతి తీసికోమని కోరాడు. ఆ ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి హనుమంతుడు ముందుకు సాగాడు. సురస అనే నాగమాత హనుమను పరీక్షింపదలచి, మృత్యుగహ్వరంలాంటి తన నోరు తెరచి అతని దారికి అడ్డు నిలచింది. యుక్తిగా ఆమె నోట ప్రవేశించి, మళ్ళీ బయటకు వచ్చి, ఆమె ఆశీర్వచనం పొంది హనుమంతుడు ముందుకు సాగాడు. సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసి హనుమంతుని నీడను పట్టి లాగసాగింది. హనుమంతుడు శరవేగంతో దాని కడుపులో దూరి, కడుపును చీల్చి వేసి, అప్రతిహతంమైన రామబాణంలా లంకలోని త్రికూటగిరి శిఖరంపై వాలాడు.

No comments:

Post a Comment