ఏకామ్రేశ్వర నిలయం శివకంచి

పుష్పేషు జాజి, పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కంచి అని పురాణ ప్రసిద్ధి. పంచభూత లింగాలలో స్థిరమైనది, జీవనాధారమైనది అయిన పృథ్వీలింగం కొలువైన పుణ్యక్షేత్రం కాంచీపురం. ఇక్కడి అమ్మవారు కామాక్షీ దేవిగా, స్వామివారు ఏకామ్రేశ్వరునిగా భక్తులను కరుణిస్తున్నారు. స్వామి వారు పృథ్వీలింగం కావడంతో జలాభిషేకం చేయరు. తైలలేపనం మాత్రమే జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో 1008 లింగాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆది పరాశక్తి పార్వతీదేవి కామాక్షిగా కొలువయ్యారు. శంకర భగవత్పాదుల వారి పూజలందుకున్న తల్లి. అమ్మవారి ఉగ్రతను తగ్గించడానికి ఆదిశంకరులవారు శ్రీచక్రాన్ని స్థాపించారు. రక్తబలులకు మారుగా సాత్విక బలిని ప్రవేశపెట్టారు. చతుర్భుజియైన అమ్మవారి విగ్రహం పద్మాసనంతో యోగముద్రలో ఉంటుంది. నాలుగు చేతులలోనూ చెరుకుగడ, తామరపుష్పం, చిలుక, పాశాంకుశాలను ధరించి ఉంటారు. వేల ఏళ్ళనాటి మామిడి చెట్టుకు నాలుగు కొమ్మలలో నాలుగు రుచుల పళ్ళు కాస్తాయని భక్తుల విశ్వాసం.

ఇదే క్షేత్రంలో వైష్ణవ మతానుయాయులైన పల్లవరాజులు శ్రీమహావిష్ణువుకోసం మరో నగరాన్ని స్థాపించారు. ఏకామ్రేశ్వర నిలయం శివకంచిగా, వరదరాజ పెరుమాళ్ కొలువైన ప్రాంతం విష్ణుకంచిగా ప్రసిద్ధికెక్కాయి. బల్లి దోషాన్ని పోగొట్టుకోవడానికి స్వర్ణ, రజిత బల్లులు గల ఆలయం విష్ణు కంచిలో ఉంది. హరిహర తత్త్వాన్ని చాటి చెప్పే ఈ రెండు క్షేత్రాలు వాస్తవానికి ఒకటే. అందుకే భక్తులు విధిగా శివకంచి, విష్ణుకంచిలలో భగవద్దర్శనం చేసుకొని పునీతులు అవుతారు.


No comments:

Post a Comment