ఉగాది పచ్చడి,పంచాంగ శ్రవణం

రుతువులు మారుతుంటాయి...వాటితోపాటే అవి మనకు పంచిచ్చే అనుభూతులూ మారుతుంటాయి. అందుకే ప్రకృతి ఎప్పుడూ నిత్యనూతనంగా ఉంటుంది.
శిశిరంలో మోడైపోయిన చెట్లన్నీ వసంతంలో చిగుళ్లు తొడిగి కొత్త సింగారాలొలుకుతుంటాయి. పచ్చగా కళకళలాడుతుంటాయి. రుతువుల్లో వసంతం మనోహరమైనదీ ఆహ్లాదకరమైనదీనూ. రుతువుల్లో వసంతరుతువు తానే అన్నాడు శ్రీకృష్ణుడు. అందుకే సంవత్సర ఆరంభానికి దీన్నే కాలమానంగా తీసుకుని తొలిరుతువుగానూ చెబుతారు. అలాంటి వసంతంలో వచ్చే తొలి మాసం చైత్రం. తిథుల్లో తొలి గౌరవం పాడ్యమిది. బ్రహ్మ సృష్టి ఆరంభించినది ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే అంటోంది బ్రహ్మపురాణం. అదే యుగాది. అన్నీ తొలిగా వచ్చే ఆ రోజే తెలుగువారి తొలిపండగ... ఉగాది!
రామపట్టాభిషేకం జరిగిందీ , శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిందీ , కలియుగం ప్రారంభమైందీ ఆ రోజేనని పండితులు చెబుతారు. ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త వరాహమిహిరుడి అంచనాల ప్రకారం చైత్రమే తొలిమాసం. ఆ రోజే తొలి పంచాంగాన్ని జనజీవన స్రవంతికి అంకితం చేశాడాయన. విక్రమార్కుడూ , ఆంధ్రరాజుల చక్రవర్తి శాలివాహనుడూ సింహాసనాన్ని అధిష్ఠించిందీ ఈ చైత్ర శుద్ధ పాడ్యమినాడే. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే చాంద్రమానాన్ని అనుసరించే తెలుగు, కన్నడ, మహారాష్ట్ర ప్రజలు చైత్రశుద్ధపాడ్యమినే నూతన సంవత్సర ఆరంభదినంగా కొత్తదనానికి ప్రారంభంగా భావించి పండగ జరుపుకుంటారు. సౌరమానాన్ని పాటించే తమిళులు, మలయాళీలు, బెంగాలీలు, సిక్కులు చేసుకునే ఉగాది కూడా వసంతంలోనే రావడం విశేషం.
ఉగాది పచ్చడి
ఈ పండగ పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. మామిడిపిందెలు, వేపపువ్వు, కొత్తబెల్లం, చింతపండు, పచ్చిమిరప, ఉప్పు వేసి చేసే ఈ పచ్చడిలోని ఆరురుచులూ జీవితంలోని సుఖదుఃఖాలకు ప్రతీకలు. ఈ జీవనతత్త్వం సంగతెలా ఉన్నా వేసవి ఆరంభంలో షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలోని వాత, కఫ, పిత్త దోషాలేమయినా ఉంటే పోతాయంటోంది ఆయుర్వేదం. వేపపువ్వులో యాంటీసెప్టిక్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. క్రిములనీ చర్మరోగాలనీ నివారించే శక్తీ ఉంది. మామడిముక్కలు రక్తప్రసరణదోషాలను నివారిస్తాయి. చింతపండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొత్తబెల్లం వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది. పచ్చిమిరప చెవిపోటు, గొంతువాపు వంటి దుర్లక్షణాలను అరికడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా చూసే పని ఉప్పుది. కొత్తకుండలోనే ఈ పచ్చడిని చేయడంవల్ల అది చల్లగా ఉంటుంది. వీటితోపాటు చెరకుముక్కలు, అరటిపండు... కూడా కలుపుతుంటారు కొందరు.
అయితే ధర్మసింధు వంటి గ్రంథాలు అసలు ఉగాది పచ్చడి ఇది కాదంటాయి.
ఈ పచ్చడిని పూర్వం 'నింబ కుసుమ భక్షణం' అనేవారట. రుతుమార్పు కారణంగా వచ్చే అన్ని ఇబ్బందులూ తొలగిపోవాలంటే ఉగాదిపచ్చడిలో మామిడిచిగురూ, అశోకవృక్షం చిగుళ్లూ కూడా కలపాలట. అందుకే దీన్ని 'అశోక కళికా ప్రాసనం' అనేవారట.
'త్వామష్ఠ శోక నరాభీష్ట మధుమాస సముద్భవ
నిబామి శోక సంతప్తాం మామశోకం సదాకురు'
(నేను జీవిత సమస్యలతో బాధపడుతున్నాను. ఓ అశోకమా! ఈ మధుమాసంలో నీవు చిగురించి కళకళలాడుతున్నట్లుగా నా జీవితానికి కూడా సుఖసంతోషాలు కలిగించుమా) అనే మంత్రం చదువుతూ దీన్ని తినాలట. అదీ ఒక్క పండగరోజే కాదు. శ్రీరామనవమి వరకూ అంటే తొమ్మిదిరోజులపాటు తినాలట. కాలక్రమంలో మామిడి చిగుళ్లు పోయి ముక్కలొచ్చాయి.
అయితే ఇప్పటికీ కర్ణాటక వాళ్లయితే 'బేవు బెలాల పేరుతో వేపచిగుళ్లూ బెల్లం కలిపి పచ్చడిలా చేసుకుని తింటారు. మరాఠాలు పచ్చడిలో వేపాకులూ వామూ కూడా కలుపుతారు.
ఉగాది అనగానే గుర్తుకొచ్చే మరో అంశం నూతన వస్త్రధారణ. కొత్త చిగుళ్లతో కళకళలాడే ప్రకృతికాంతను సూచిస్తూ కొత్తదుస్తుల్ని ధరించడం ఆనవాయితీగా వస్తోంది. అదీ తెలుపురంగు లేదా లేలేతరంగుల్లో ఉండే పలుచని దుస్తులే ఎక్కువగా ధరిస్తారు. వచ్చేది వేసవికాలం కాబట్టి ఆ సమయంలో ధరించడానికి హాయిగా చల్లగా ఉండేందుకు ఎండని గ్రహించని తెలుపురంగు దుస్తుల్నే ముందు జాగ్రత్తగా కుట్టిస్తారన్నమాట.
ఇక కవి సమ్మేళనాలు... కవులు ప్రకృతి ప్రేమికులు. ప్రకృతికి వసంతరుతువుకన్నా ప్రియమైన కాలమేముంటుంది. అందుకేనేమో కవి సమ్మేళనాలకీ ఉగాదే వేదికగా మారింది.
పంచాంగ శ్రవణం
ఉగాదినాడు విధిగా పంచాంగశ్రవణమూ ఉంటుంది. ఇందులోనూ పరమార్థముంది. ఇది మన ఖగోళ శాస్త్రీయ దృక్కోణానికి అద్దంపట్టే సంప్రదాయం. ఎందుకంటే ఖగోళ స్థితిగతులను అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారు. ఇందులో ఐదు అంగాలుంటాయి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంలను పంచాంగం అంటారు. చంద్రుని నడకకు సంబంధించినది తిథి. వారంలోని ప్రతిరోజునీ ఒక గ్రహానికి అధిదేవతగా భావించి ఆరోజును ఆ గ్రహం పేరుతో పిలుస్తారు. రాశిచక్రంలోని 27 నక్షత్రాల్లో ఏ రోజున ఏ నక్షత్రం దగ్గరకు చంద్రుడు వస్తే ఆ రోజు ఆ నక్షత్రం ఉన్నట్లు చెబుతారు. నక్షత్రరాశిలో సూర్యచంద్రులు ఉన్నట్లు భావించి యోగం లెక్కగడతారు. ఇక తిథిలో అర్ధభాగం కరణం. ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టే భవిష్యత్తు గురించి ముందే తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ ఏడాది వాతావరణం ఎలా ఉండబోతుందీ ఏయే పంటలు వేస్తే మంచిదీ వంటి విషయాలన్నీ రైతులు తెలుసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో సాగుపనులనూ ఈరోజే లాంఛనంగా మొదలుపెడతారు.
మనందరికీ తెలిసిన ఈ పద్ధతులే కాదు, ఉగాదినాడు ఆచరించేవి ఇంకా కొన్ని ఉన్నాయి.
ధ్వజారోహణం: వాకిట్లో ధ్వజాన్ని నిలిపి దానికి చిగుళ్లూ కొమ్మలూ కడతారు. దీన్నే బ్రహ్మధ్వజం అంటారు. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించాడనడానికి గుర్తుగా దీన్ని నిలబెడతారు. మహారాష్ట్రీయులు ఈ ఆచారాన్ని ఇప్పటికీ తప్పక పాటిస్తారు. ఆకులూ పువ్వుల తోరణాలతో ఇంటిని అలంకరిస్తారు.
దవనోత్సవం: పరిమళపత్రమైన దవనం ఈ కాలంలో ఏపుగా పెరుగుతుంది. అందుకే ఈ పత్రంతో చైత్రశుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకూ బ్రహ్మాదిదేవతలను పూజించాలని చెబుతారు. ఇది భూత బాధలనీ శరీరదుర్గంధాన్నీ హరిస్తుంది. ముఖ్యంగా దవనానికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే శక్తి ఉంది. ఈ ఆచారం వెనకున్న అసలు కిటుకు ఇదే. దవనంతోపాటు వసంతంలో విరివిగా పూసే మల్లెలకీ ఈ శక్తి ఉంది. అందుకే మరువం, మల్లెలు కలిపి కట్టే మాలలే ఈ కాలంలో దేవతావిగ్రహాలకీ ఎక్కువగా అలంకరిస్తారు.
ఛత్రచామరాల సేకరణ: చైత్రం నుంచీ ప్రత్యక్షనారాయణుడి కిరణాల పదును పెరుగుతుంది. కాబట్టి గొడుగులూ విసనకర్రలూ సేకరించుకుంటారు.
ప్రపాదాన ప్రారంభం: ప్రప అంటే చలిపందిరి. ప్రపాదానం అంటే చలివేంద్రం పెట్టి దాహం తీరే తీర్థాలు ఇవ్వడం. అదీ ఈ రోజే ప్రారంభిస్తారు. వేసవిలో గొంతెండిపోయే బాటసారులకు నీటిని దానం చేయడం శుభంగా భావిస్తారు.
వాసంతి నవరాత్రి ఉత్సవం: ఉగాదితో ప్రారంభించి నవరాత్రి వరకూ ఈ వేడుకల్ని జరుపుతారు. ఏడాదిపొడవునా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీరామనవమి తరవాత వచ్చే దశమి వరకూ రాముడిని వేడుకుంటూ వీటిని నిర్వహిస్తారు.
చిన్నచిన్న మార్పులున్నప్పటికీ మన ఆచారాలూ సంప్రదాయాలన్నింట్లోనూ ఏదో ఒక పరమార్థముంది. అందుకే వాటిని పండగల రూపంలో మన జీవనంలో భాగం చేశారు పెద్దలు.

No comments:

Post a Comment