రామాయణం -- 36

భరతుడి సైన్యంలోని ఏనుగుల, గుర్రముల పద ఘట్టనలని విన్న రాముడు " ఇంతకముందు ఎన్నడూ ఇలా లేదు, ఎక్కడ చూసినా జంతువులు భయంతో పరుగులుతీస్తున్నాయి. ఎవరో ఒక రాజో, లేక ఒక రాజ ప్రతినిధో అరణ్యానికి వేటకి వచ్చినట్టు అనుమానంగా ఉంది " అని లక్ష్మణుడిని పిలిచి, ఒకసారి పరిశీలించి రమ్మన్నాడు.
అప్పుడు లక్ష్మణుడు దెగ్గరలో ఉన్న ఒక పుష్పించిన పెద్ద చెట్టు ఎక్కి తూర్పు దిక్కుకి చూశాడు. ఆ దిక్కున ఆయనకి ఏమి కనపడలేదు. తరువాత ఉత్తర దిక్కుకి చూసేసరికి, కోవిదార వృక్షం ధ్వజంగా కలిగినటువంటి ఒక పెద్ద సైన్యం కనబడింది. అప్పుడు లక్ష్మణుడు రాముడితో....
అగ్నిం సమ్షమయతు ఆర్యహ్ సీతా చ భజతాం గుహాం |
సజ్యం కురుష్వ చాపం చ షరామ్హ్ చ కవచం తథా ||
" అన్నయ్యా! వెంటనే మన దెగ్గరున్న అగ్నిహోత్రాలన్నిటిని తగ్గించేసెయ్యి. లోపలున్న బాణాలు, ధనుస్సులు, అక్షయ బాణతూణీరాలు పట్టుకొని తొందరగా వస్తే మనం యుద్ధం చెయ్యాలి. ఎందుకంటే, నీకు రాజ్యం దక్కకుండా చేసి, అరణ్యాలకి పంపించడమే కాకుండా, శత్రుకంటకం లేకుండా చేసుకోవడానికని నిన్ను సంహరించడం కోసం భరతుడు అరణ్యానికి వచ్చాడు. ఇంతకన్నా మంచి అదును దొరకదు. ఇంతకాలం దాచుకున్న కోపాన్ని ఇప్పుడు బయట పెడతాను. ఉత్తరక్షణం భరతుడి తల, కైకేయ తల కత్తిరిస్తాను. నిన్ను సంహరించడానికి వస్తున్న ఆ సైన్యాన్ని నాశనం చేస్తాను. అందరినీ చంపాక, వాళ్ళ కళేబరాలని క్రూర మృగాలు తింటుంటే, చూసి నేను సంతోషిస్తాను " అన్నాడు.
లక్ష్మణుడి మాటలను విన్న రాముడు " లక్ష్మణా! ఎందుకు తీసుకురావాలి ధనస్సు. వాటితో భరతుడిని సంహరించాల? తండ్రిగారి కోరిక ప్రకారం నేను అరణ్యాలకి వచ్చాను, నన్ను చూడడానికి భరతుడు వస్తున్నాడు. ఇప్పుడు నేను భరతుడికి ఎదురెళ్ళి యుద్ధం చెయ్యనా?
ధర్మమర్థం చ కామం చ పృ్ఇథివీం చాపి లక్శణ |
ఇచ్చ్హామి భవతామర్థె ఎతత్ ప్రతిషృ్ఇణొమి తె ||
ధర్మము కాని, అర్థము కాని, కామము(కామము అనగా కోరిక) కాని, ఈ మూడిటిలో నేను ఏ ఒక్కదాన్ని అనుభవించాల్సి వచ్చినా, నా తోడపుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించని దానిని నేను అనుభవించను. వాళ్ళు ఆనందంగా ఉంటె, నేను ఆనందంగా ఉంటాను. అసలు ఎప్పుడైనా భరతుడు నీ పట్ల అపచారంతో, నువ్వు బాధ పడేటట్టు ప్రవర్తించాడ? మరి నీకు భరతుడి మీద ఎందుకు అనుమానము " అని రాముడు చెప్పినా కాని, లక్ష్మణుడు ఆ చెట్టు మీద కూర్చుని భరతుడి మీద కోపంతో బుసలు కొడుతూ ఉండేసరికి " నీకు రాజ్యం చెయ్యాలని ఉందేమో, నేను భరతుడితో చెప్పి రాజ్యాన్ని నీకు ఇమ్మంటాను, భరతుడు ఎటువంటి వాడో చూద్దువు కాని " అని రాముడు అన్నాడు.
ఈ మాటలకి సిగ్గుపడిన లక్ష్మణుడు " అన్నయ్యా! నిన్ను చూడడానికి దశరథ మహారాజు గారు వచ్చారేమో. వదిన ఇక్కడ అరణ్యాలలో బాధపడుతుందని, తనని తీసుకెళ్ళడానికి నాన్నగారు వచ్చుంటారు " అన్నాడు.
అప్పటిదాకా కూర్చొని ఉన్న రాముడు ఒకసారి పైకిలేచి ఆ సైన్యం వైపు చూసి " నాన్నగారు అధిరోహించేటటువంటి శత్రుంజయం అనే భద్రగజం కనిపిస్తుంది, ఆ భద్రగజం మీద తెల్లటి గొడుగు నీడలో నాన్నగారు వస్తుంటారు, కాని ఇవ్వాళ ఆ గజం మీద తెల్లటి గొడుగు నాకు కనపడడం లేదు లక్ష్మణా, నా మనసు ఏదో పీడని సంకిస్తుంది " అన్నాడు.
ఇంతలో భరతుడు " ఏనాడు నేను సీతమ్మ పక్కన కూర్చున్న లక్ష్మణ సహితుడైన రాముడిని చూస్తానో, ఆనాటి వరకు నా మనస్సుకి శాంతి లేదు. ఏనాడైతే నేను సీతారాముల పాదములను నా తల మీద పెట్టుకుంటానో, అప్పుడు నా తల మీద పడినటువంటి వారి పద రజస్సు వలన నాకు శాంతి కలుగుతుంది. ఏనాడైతే సీతారాములు బంగారు ఆసనం మీద కూర్చొని ఉంటారో, ఏనాడైతే రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందో ఆనాటిదాకా నా మనస్సుకి శాంతి లేదు " అని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు.
తం తు కృ్ఇష్ణ అజిన ధరం చీర వల్కల వాససం |
దదర్ష రామం ఆసీనం అభితహ్ పావక ఉపమం ||
సిమ్హ స్కంధం మహా బాహుం పుణ్డరీక నిభ ఈక్షణం |
పృ్ఇథివ్యాహ్ సగర అంతాయా భర్తారం ధర్మ చారిణం ||
గొప్ప ధర్మం తెలిసినవాడు, సింహంలా నడవగలిగినవాడు, గొప్ప బాహువులు ఉన్నవాడు, సాగరము చేత పరివేష్టింపబడినటువంటి సమస్త భూమండలాన్ని పరిపాలించగల సమర్ధత కలిగినవాడైన రాముడు, ఈనాడు నార చీర కట్టుకొని, ఒక ముని కూర్చున్నట్టు కృష్ణాజినాన్ని పైన ఉత్తరీయంగా వేసుకొని, వీరాసనం వేసుకొని కూర్చునేసరికి, చూసిన భరతుడి మనస్సు ఆగలేదు. నా వల్ల అన్నగారికి ఇన్ని కష్టాలు వచ్చాయని, పరిగెత్తుకుంటూ వస్తూ, "రామా" అని ఒకసారి పిలిచి, శోకభారంతో నేల మీద పడిపోయాడు.
అప్పుడు భరతుడు రాముడిని చూసేసరికి, ఆయన శరీరం అంతా మట్టితో కప్పుబడి ఉంది. రాజభవనంలో చీని చీనాంబరాలు కట్టుకొని, అంగరాగములు(గంధము మొదలైన పరిమళ భరితములు) పూసుకొని తిరగవలసిన వాడు, ఇలా మట్టితో కప్పబడడం చూసి భరతుడు కన్నీరు పెట్టుకున్నాడు.
ఆ అరణ్యంలోకి ఒకేసారి ఇంత గొప్ప సైన్యం వచ్చేసరికి, ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి గిరిజనులు అందరూ అక్కడికి చేరి " ఈ మధ్య పర్ణశాల కట్టుకొని ఉంటున్నాయన తమ్ముడంట ఈయన, ఆయన రాజు అంట, తండ్రి మాట కోసం అరణ్యానికి వచ్చాడంట రాజ్యం వద్దని, ఆ అన్నయ్యని తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాడంట, ఎక్కడైనా చూసామా ఈ విడ్డూరం, రాజ్యం నాకు వద్దంటే, నాకు వద్దని దెబ్బలాడుకుంటున్నారు, ఆహా, ఏమి అన్నదమ్ములయ్యా " అని ఆ గిరిజనులు మాట్లాడుకుంటున్నారు.
అప్పుడు రాముడు పరుగు పరుగున వచ్చి, భరతుడిని పైకి లేపి, స్వస్థత కలిగిన తరువాత తన వొళ్ళో కుర్చోపెట్టుకున్నాడు. తరువాత ఆయన భరతుడి గెడ్డం పట్టుకొని పైకి ఎత్తి " నాన్నా భరతా! ఈ వేషం ఏంటి. నార చీరలు కట్టుకున్నావు, తలకి జటలు వేశావు, కాంతి హీనుడవయిపోయి నల్లగా అయిపోయావు, చాలా దూరంలో ఉన్న మీ మేనమామ యుధాజిత్ గారి కైకేయ దేశం నుంచి ఎప్పుడు వచ్చావు. అసలు నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకి వస్తుంటే, దశరథుడు నిన్ను ఎలా విడిచిపెట్టాడు. నాకు ఎందుకో భయంగా ఉంది, దశరథ మహారాజు పరలోకగతుడు కాలేదు కదా, అందుకని నువ్వు రాలేదు కదా, చిన్నవాడిని చేసి రాజ్యాన్ని ఎవరూ తస్కరించలేదు కదా, నీకు ఎటువంటి ఆపద రాలేదు కదా.
పురోహితులని సరైన వాళ్ళని పెట్టుకున్నావా, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం వలనే ఈశ్వరుడి కృప లభించి, వేళకి వర్షాలు పడతాయి, ధనుర్వేదానికి సంబంధించి సరైన పురోహితుడిని ఏర్పాటు చేసుకున్నావ, ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అనైక్యత వస్తుంది, అలాగని తక్కువ మంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే సరియైన అభిప్రాయం బయటకి రాకపోవచ్చు, నువ్వు వాళ్ళ మీద గద్దిస్తే, వారు నిన్ను చూసి భయపడవచ్చు, అలాగని అందరినీ నీ దెగ్గర చేర్చుకుంటే, వాళ్ళకి నీ మీద భయం లేకపోవచ్చు, అందుకని వారిని ఎప్పుడు నీ దెగ్గరకి చేర్చుకోవాలో, ఎప్పుడు దూరం పెట్టాలో, ఈ రెండిటిలో సమతౌల్యాన్ని పాటిస్తున్నావా.
మంత్రులకు ఉపధ పరీక్షలు నిర్వహిస్తున్నావా (ఉపధ పరీక్షలు అంటె రహస్య పరీక్షలు. పూర్వకాలం రాజు ఎవరికైనా మంత్రి పదవి ఇచ్చేముందు, రహస్యంగా తమ అంతఃపుర కాంతలకి కానుకలు ఇచ్చి, వాటిని ఎవరికీ తెలియకుండా, ఆ కాంత చేత మంత్రి పదవికి నిర్ణయింపబడ్డ వ్యక్తికి కానుకగా ఇప్పించేవారు. అంటె, ఆ కానుకలని చూసి, ఆ కాంతని చూసి మోహపడతాడేమోనని ఇది ఒక పరీక్ష. అలాగే, విదేశ రాజుల గూఢచారులుగా వచ్చినట్టు ఈ దేశపు రాజె కొంతమందిని పంపి, నువ్వు ఈ రాజ్యానికి సంబంధించిన రహస్యాలు చెబితే నీకు డబ్బు ఇస్తామని చెప్పి కొంత లంచం ఇచ్చేవారు, అలా డబ్బుకి లొంగుతాడేమోనని పరీక్ష చేసేవారు. ఇలా అనేక పరీక్షలలో నెగ్గిన వారికే మంత్రి పదవి ఇచ్చేవారు), అలాగే రాజ్యంలో 18 మంది మీద ముగ్గురు గూఢచారులని పెట్టాలి (కోట రాజద్వారాన్ని కాపాడే బంట్రోతు నుంచి రాజ్య ప్రధాన కోశాధికారి దాకా ఆ 18 మందిలో ఉన్నారు), ఈ ముగ్గురు గూఢచారులకి తాము గూఢచారులమన్న విషయం ఒకరికొకరికి తెలియకూడదు, అలాగే యువరాజు మీద, ప్రధాన మంత్రి మీద, సేనాపతి మీద గూఢచారులని పెట్టకూడదు, విదేశ రాజ్యాలలో ముఖ్యమైన హొదాలలో ఉన్నవారి దెగ్గర గూఢచారులని పెట్టాలి, ఎప్పటికప్పుడు శత్రురాజుల కదలికలను తెలుసుకోవాలి, ఇవన్నీ జాగ్రత్తగా చేస్తున్నావా భరతా " అని రాజ్య పరిపాలనకి సంబంధించిన పలు విషయాలను అడిగాడు రాముడు.
రామస్య వచనం ష్రుత్వా భరతహ్ ప్రత్యువాచ హ |
కిం మె ధర్మాద్విహీనస్య రాజధర్మహ్ కరిశ్యతి ||
రాముడి మాటలు విన్న భరతుడు " అన్నయ్యా! నువ్వు నాకు ఇవన్నీ చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కాని, నాకు ఎందుకు అన్నయ్యా ఈ ధర్మాలన్నీ, ఈ ధర్మాలన్నీ రాజుకి కావాలి, నేను రాజుని కాను, ఎప్పటికి రాజుని కాను. కాని అన్నయ్యా, మన వంశంలో ఉన్న సంప్రదాయం ప్రకారం, ఎవరు పెద్ద కొడుకుగా జన్మిస్తాడో, వాడు మాత్రమే పట్టాభిషేకం చేయించుకోవాలి. నాకు ఈ ధర్మం ఒక్కటే తెలుసు. నాకన్నా పెద్దవాడివి నువ్వు ఉండగా, నేను రాజధర్మాలు తెలుసుకోవలసిన అవసరం లేదు. అందుకని నేను ఎప్పుడు ఆ రాజధర్మాల్ని తెలుసుకోలేదు. నీ దెగ్గరికి ఒకరు వచ్చి అడిగితేనే నువ్వు కాదనలేవు, అలాంటిది రాజ్యం అంతా వచ్చి నిన్ను అడుగుతోంది పట్టాభిషేకం చేసుకోమని, నువ్వు వాళ్ళ కోరిక తీర్చకుండా ఎలా ఉండగలవు. అందుకని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకో. నేను లేనప్పుడు మా అమ్మ దశరథ మహారాజుని రెండు కోరికలని అడిగింది. సత్యానికి కట్టుబడి దశరథుడు ఆ రెండు కోరికలని తీరుస్తాను అన్నాడు. అందుకని నువ్వు అరణ్యాలకి వెళ్ళావు. కాని నేను ఆ రాజ్యాన్ని తీసుకోలేదు. అదే సమయంలో మా అమ్మ విధవ అయ్యింది. ఇవ్వాళ నాన్నగారు లేరు అన్నయ్యా, నువ్వు వెళ్ళిపోవడం చేత ఇంత ఉపద్రవం వచ్చింది " అన్నాడు.
ఈ మాట విన్న రాముడు, కూర్చున్న చోటనుంచే కింద నేల మీద పడి మూర్చపోయి, అది మట్టి అని కూడా చూడకుండా తండ్రిని తలుచుకొని ఆ మట్టిలో దొర్లుతూ ఏడుస్తున్నాడు. రాజ్యం పోయినప్పుడు కాని, అరణ్యాలకి వెళ్ళమన్నప్పుడు కాని ఏడవని రాముడు, ఇలా నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే సీతమ్మ, లక్ష్మణుడు గబగబా ఆయన దెగ్గరికి వచ్చారు.
సీతె మృ్ఇతస్తె ష్వషురహ్ పిత్రా హీనొ.అసి లక్శ్మణ |
భరతొ కుహ్ఖమాచశ్టె స్వర్గతం పృ్ఇథివీపతిం ||
సీతా పురస్తాద్ర్వజతు త్వమెనామభితొ వ్రజ |
అహం పష్చాద్గమిశ్యామి గతి ర్హ్యెశా సుదారుణా ||
వాళ్ళని చూసిన రాముడు " భరతుడు ఇప్పుడే వచ్చి ఒక మాట చెప్పాడు. సీతా! మీ మామగారు మరణించారు. లక్ష్మణా, నీకు తండ్రిగారు మరణించారు. జీవితంలో ఎన్నడూ నడవకూడని నడక నడుద్దాము సీతా, బయలదేరు " అన్నాడు.
(రాముడిని కన్న తండ్రిలా, ఎల్ల వేళలా కాపాడుకోడానికి లక్ష్మణుడు ఉన్నాడు, అందుకని లక్ష్మణుడితో నీ తండ్రి చనిపోయాడు అని చెప్పాడు. అలాగే, ఇంటి యజమాని మొదట నడవాలి, ఆయన వెనకాల స్త్రీ నడవాలి. ఇంటి యజమాని చనిపోతే, ఆయనకి ధర్మోదకాలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు స్త్రీ ముందు నడుస్తుంది, అలాంటి నడకని దారుణమైన నడక అంటారు.)
అప్పుడు రాముడు మందాకినీ నదిలో స్నానం చేసి, దక్షిణ దిక్కుకి తిరిగి దశరథుడికి జలతర్పణలు సమర్పించాడు. తరువాత లక్ష్మణుడిని పిలిచి, పర్ణశాలలో ఉన్నటువంటి గార కాయలని బద్దలు కొట్టి, ఉండ చేసి, రేగు పిండితో కలిపి తీసుకురమ్మన్నాడు. అలాగే దర్భల యొక్క కొసలు దక్షిణ దిక్కుకి ఉండేటట్టు పరవమని, వాటి మీద పిడచలు పెట్టాడు ( తాను ఏది తింటున్నాడో, అదే పితృదేవతలకి తద్దినం నాడు పెట్టాలి).
అలా దశరథుడికి తద్దినం పెట్టాక, నలుగురూ వచ్చి కూర్చున్నారు. అప్పుడు భరతుడు " అన్నయ్యా! నేను ఎప్పుడూ రాజ్యం కోరుకోలేదు. మా అమ్మ అడిగిందన్న మాట నాకు తెలీదు. నాకు ఈ రాజ్యం అక్కరలేదు. ఈ రాజ్యాన్ని నువ్వు మాత్రమే భరించగలవు, నేను భరించలేను, అందుకనే ఇంతమంది పౌరులు, జానపదులు మొదలైన వారు వచ్చారు. కనుక, దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు " అన్నాడు.
" మనం ఎక్కడ ఉండాలో నిర్ణయించాల్సిన వాడు మన తండ్రిగారు. ఆయన నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు, నిన్ను రాజ్యం తీసుకోమన్నారు. నీకు ఇచ్చినది నువ్వు తీసుకో, నాకు ఇచ్చినది నేను తీసుకుంటాను. అంతేకాని తండ్రిగారు ఇచ్చినదాన్ని తారుమారు చేసే అధికారం మనకి లేదు " అని రాముడు అన్నాడు.
ఆ రోజు రాత్రికి అందరూ పడుకున్నారు, మరునాడు ఉదయం లేచి అందరూ నిశబ్దంగా కూర్చొని ఉన్నారు. ఈలోగా వశిష్ఠుడు కౌసల్య, సుమిత్ర, కైకేయలతో ఆ ప్రాంతానికి చేరుకున్నాడు ( రాముడిని చేరుకోవాలనే తొందరలో, భరతుడు మిగతా పరివార జనులకంటే ముందు వచ్చాడు). అప్పుడు కౌసల్య ఆ మందాకినీ నది ఒడ్డున ఉన్నటువంటి గార పిండి, రేగు పిండి ముద్దలని చూసి, రాముడు వీటిని తద్దినంలో పెట్టాడంటే, రాముడు ఇవ్వాళ వీటిని తిని బతుకుతున్నాడని బాధపడింది.
అందరూ అక్కడికి చేరుకున్నాక, భరతుడు లేచి " అన్నయ్యా! ఏ రాజ్యాన్ని మా అమ్మ నాకు ఇవ్వాలనుకుందో, ఆ రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. గాడిద, గుర్రం నాలుగు కాళ్ళ జంతువులు, ఒకే అరణ్యంలో ఉంటాయి. అలా ఉన్నంతమాత్రాన గుర్రం నడక గాడిదకి వస్తుందా. మనిద్దరమూ దశరథ మహారాజు కుమారులమే, కాని రాజ్య నిర్వహణలో నీకున్న శక్తి నాకు ఎలా వస్తుంది. అందుకని ఈ రాజ్యభారాన్ని నువ్వే స్వీకరించు " అన్నాడు.
అప్పుడు రాముడు " ఒక మహాసముద్రంలో రెండు పుల్లలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. అవి కొంత కాలం కలిసి నీళల్లో తేలుతూ వెళతాయి. అవే పుల్లలు ఆ ప్రవాహంలో ఏదో ఒక రోజు విడిపోక తప్పదు. మన జీవితాలు కూడా అంతే. మనం ఎందులోనుంచి ఒకడిగా వచ్చామో, మళ్ళి అందులోకి ఒక్కడిగానే వెళ్ళిపోతాము. తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. ఇది తెలుసు కాబట్టే దశరథ మహారాజు యజ్ఞయాగాది క్రతువులు చేసి పుణ్యాన్ని మూటకట్టుకొని స్వర్గానికి వెళ్ళిపోయారు. తండ్రిగారు ఒక మాట చెప్పి వెళ్ళిపోయారు, దాని ప్రకారం ఈ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి " అన్నాడు.
అప్పుడు భరతుడు " అన్నయ్యా! నేను నా తల్లిని చంపుదాము అని అనుకున్నాను. అమ్మని చంపితే నువ్వు నాతో మాట్లాడవని నేను చంపలేదు. సభాముఖంగా నాన్నగారిని నేను ఎప్పుడూ నిందించలేదు. మరణకాలం దెగ్గర పడిపోతుంటే బుద్ధి విపరీతత్వాన్ని పొందుతుంది, బహుశా దశరథ మహారాజుకి కూడా అలా విపరీత బుద్ధి పుట్టడం వల్ల ఆయన ఒక పొరపాటు పని చేశారు. ఇక్ష్వాకు వంశం యొక్క సంప్రదాయం ప్రకారం పెద్దవాడు పరిపాలించవలసిన రాజ్యాన్ని ధర్మం తప్పి నాకు ఇచ్చారు. ఒకవేళ తండ్రిగారు ఏదన్నా చెయ్యరాని పని చేస్తే, కుమారుడు దానిని దిద్దాలి. అందుకని నువ్వు ఆ పొరపాటుని దిద్దాలి. అలాగే క్షత్రియుడికి రాజ్యపాలనం చెయ్యవలసిన ధర్మం ఉంది, కాని నువ్వు రాజ్యపాలనం మానేసి తాపసి వృత్తిని అవలంబించావు " అన్నాడు.
రామభరతుల మధ్య జెరుగుతున్న ఈ ధర్మ సంభాషణని వినడానికి దేవతలు, మహర్షులు మొదలైన వారు వచ్చి నిలబడ్డారు.
ఈ మాటలు విన్న రాముడు " దశరథ మహారాజు కైకేయని వివాహం చేసుకునే ముందు, మీ తాతగారైన కైకేయ రాజుకి ఒక మాట ఇచ్చారు. కైకేయ కడుపున ఎవరు పుడతారో వాళ్ళకి రాజ్యం ఇస్తానని నాన్నగారు ప్రమాణం చేశారు. ఈ విషయం వశిష్ఠుడికి, సుమంత్రుడికి తెలుసు. ఈ విషయం తెలిసిన కైకేయ రాజు, వశిష్ఠుడు, సుమంత్రుడు ఊరుకున్నారు. మీ అమ్మ రెండు వరాలు అడిగింది, మళ్ళి ఆ రెండు వారాలకి దశరథుడు బద్ధుడయ్యాడు. అందుకని ఎటునుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది, తండ్రిగారు చేసిన దానిలో పొరపాటు ఉంటె నేను దిద్దాలి, కాని అందులో పొరపాటు లేదు. మనం పుట్టక ముందే నాన్నగారు రాజ్యాన్ని నీకు ఇచ్చారు. కనుక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి.
త్వం రాజా భవ భరత స్వయం నరాణాం |
వన్యానాం అహం అపి రాజ రాణ్ మృ్ఇగాణాం ||
నువ్వు అయోధ్యా పట్టణానికి వెళ్ళిపో, నరులకందరికి నువ్వు రాజుగా ఉండి శ్వేత ఛత్రం కింద కూర్చొని పరిపాలన చెయ్యి. నేను అరణ్యాలకి వెళ్ళి చెట్టుకింద కూర్చొని మృగాలని నేను పరిపాలిస్తాను. అందుకని, భరత నువ్వు వెళ్ళిపో " అన్నాడు.

No comments:

Post a Comment