యదువంశ విస్తరణ-శ్రీ విష్ణు పురాణము

పూర్వమొకప్పుడు హిరణ్యకశిపుడను రాక్షసరాజుగా పుట్టి, నరసింహావతార ఘట్టమున స్రీహరిచే చంపబడిన రాక్షసుడే చేదిరాజైన దమఘోషునికి శిశుపాలుడుగా జన్మించాడు. కరూష దేశాధీశుడైన వృద్ధ ధర్మునికి దంతవక్త్రుడు జన్మించాడు. వీడే పూర్వజన్మలో హిరణ్యాక్షుడు. వీరు ఈ జన్మలతో గూడ హరిపై ద్వేషముపూని, చివరికి ఆ హరిచేతనే నిర్జించబడ్డారు. పగచేత అయినా గానీ, కీర్తింపబడి - స్మరించబడినచో భగవంతుడు అట్టివారికైనా విష్ణుసాయుజ్యమిస్తాడని వీరి చరిత్రలు తెల్పుతాయి.

అసలు ఈ శ్రీకృష్ణుని జననమే అత్యంత ఆశ్చర్యాతిశయముతో కూడినట్టిది.

ఈ పుండరీకాక్షుడు అవతరిస్తుండగా, సూర్యచంద్ర గ్రహాలన్నీ సుప్రసన్నమయ్యాయి. జగత్తంతా అధర్మాలకు దూరంగా - భయరహితంగా ఉంది. అతడు జన్మించిన మరుక్షణం నుంచే ఈ జగత్తును సన్మార్గంలో పెట్టసాగాడు.

మానుషవేషధారి అయిన ఆ లీలావిగ్రహానికి 16, 100 మంది భార్యలు. వారుగాక అష్టసంఖ్యలో పట్టపురాణులు. అనాది అయిన ఆ దేవదేవునికి ఒక లక్షా ఎనబైవేలమంది సంతానం. వీరిలో ప్రధానంగా ప్రద్యుమ్నాదులు 13 మంది. అనేక శతసహస్తపురుషసంఖ్యాక మీ యదుకులం. హరివంశ విస్తరణవర్ణనకు నూరేళ్ల కాలపరిమితి కూడా సరిపోదు.

ఇటుపై - మహానందులు, శిశునాగవంశం వారు మొదలగు భవిష్యద్రాజులను గూర్చి తెలుపబడింది.

(మౌర్య, శుంగ, ఆంధ్ర, ఆభీర, నాగవంశాలను గూర్చి తెలిపే 24వ అధ్యాయంలోని భవిష్యద్రాజుల చరిత్రం ఆనాడే కథితమైంది. విశేషలు ఇవ్వబడ్డాయి.)

సేనాధిపతి అయి నపుష్యమిత్రుడు తన ప్రభువునే చంపి రాజవుతాడు. అతని పుత్రుడు అగ్నిమిత్రుడు, సుజ్యేష్ఠుడు, వసుమిత్రుడు, ఉదంకుడు, పుళిందకుడు, ఘోషవసువు, వజ్రమిత్రుడు, భాగవతుడు, దేవభూతి ఈ క్రమంలో శుంగవంశపు రాజులు 112 ఎళ్లు ఉంటారు. అటుపైన కాణ్వరాజులు ఈ భూమిని పాలిస్తారు.

శుంగరాజు దేవభూతి వ్యసనపరుడైనందున, అతని మంత్రి కాణ్వవసుదేవుడు అతడ్ని చంపి రాజవుతాడు. ఇతని పుత్రుడు భూమిత్రుడు, నారాయణుడు, సుశర్మ, వీరు 40 ఏళ్లు..సుశర్మను అతని సేవకుడు బలిపుచ్ఛకుడనేవాడు చంపి ప్రభువవుతాడు. తదుపరి వీడి తమ్ముడు కృష్ణుడనేవాడు రాజవుతాఅడు. తర్వాత ఆంధ్రరాజులపరిపాలన (458 సం||లు) ముప్పయిమంది ద్వారా సాగుతుంది. తరువాత వీరిభృత్యులు ఏడుగురు అభీరాదులు, పదిమంది గద్దభులు రాజులు, ఆ తర్వాత 16 మంది రాజులు.

అటుపైన ఎనిమిది మంది యవనరాజులు, 14 మంది తురుష్క రాజులు, 13 మంది ముండులు, 11 మంది మేనులు భూమిని దాదాపు వెయ్యేళ్లకు పైన 90 సంవత్సరములు పరిపాలిస్తారు. (ఇంతవరకు పేర్లు చెప్పబడి, ఇటుపైన పేర్లు చెప్పక కేవలం సంఖ్య మాత్రమే చెప్పబడటం గమనార్హం!) అటుపైన మూడువందల సంవత్సరాలు పౌరరాజులు పాలిస్తారు.

ఆ తరువాత కైంకిలురనే యవనులు పట్టాభిషేక రహితులు భూమిని పాలిస్తారు. వారి సంతతి 106 సంవత్సరాలు. ఆ పైన వారి పుత్రులు 13 మంది, బాహ్లికులు ముగ్గురు, పుష్యమిత్ర వటుమిత్రాదులు పదమూడుమంది. ఏకలులు ఏడుగురు ఆంధ్రులు, కైవర్త పటుపుళింద బ్రాహ్మణులును రాజులవుతారు.

ఈ క్షాత్రులనందరినీ లేవగొట్టి నవనాగులు; పద్మావతీపురం రాజధానిగా గయనుంచి, గంగా ప్రయాగ పర్యంతం గల భూమినంతటినీ మాగధేయులు అనుభవిస్తారు. కోసల, ఆంధ్ర, పుండ్ర, తామ్రలిప్త పురాలను దేవరక్షితుడు పాలిస్తాడు.

కళింగ, మాహిష, మాహేంద్ర, భౌమములను గుహులను రాజులు అనుభవిస్తారు. నైషధ, నైమిష, కకాల, కోశకాది జనపదాలను మణిధాన్యక వంశీయులు అనుభవిస్తారు. సౌరష్ట్ర, అవంతిక, శూద్ర, అభీర రాజ్యాలను వ్రాత్యద్విజులు ఏలుతారు. సింధునదీతీరం, కాశ్మీరం వరకు గల దేశాన్ని వ్రాత్యమ్లేఛ్ఛ శూద్రాదులు పరిపాలిస్తారు. (పంచుకొంటారు) సమకాలీన ప్రభువులు వీరు.

ఈ రాజులలో అధికబాగం స్త్రీ, బాల, గోవధ, పరధనాపహరణాది అకృత్యాలపట్ల ఆసక్తిగలవారు. అధర్మపరాయణులు. దయ కొంచెంగా - కోపం అధికంగాగలవారు వీరు. అల్పసారంగలవారు, అల్పాయుష్కులు. లుబ్ధులు. కోరికలు అధికం. బలవంతులు. మ్లేచ్ఛాచారులు, ఇష్టానుసార వర్తనులై సంచరిస్తూంటారు.

No comments:

Post a Comment