ఏకాదశరుద్రులు


సకల శుభస్వరూపుడైన పరమశివుడు అవసరమైనప్పుడు సాకార రూపంలో
ప్రత్యక్షమై కరుణిస్తూంటాడు. నిరాకారుడైన ఆ మహాదేవుడు పదకొండు రుద్రస్వరూపులుగా భాసిస్తుంటాడని వేదాలుబోధిస్తున్నాయి."శివ, శంభు, పినాకి, స్థాణు, భర్గ, గిరీశ సదాశివ, హర, శర్వ,కపాలి, భవ'' ఇవి ఏకాదశరుద్రుల నామాలు.

శివ : సృష్టి ఆదిలో ఓంకార నాదంతో, తెజోమూర్తిగా, దిగంబరంగా భాసించే వాడే "శివుడు''. దిక్కులే అంబరములు [వస్త్రములు]గాగలవాడు కనుక ఆయన దిగంబరుడు.

శంభు : రుద్రమాయకులోనైన బ్రహ్మ, విష్ణువులు తమ జన్మకు కారణంతెలుసుకునే ప్రయత్నం చేయగా వారిముందు జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమై, సృష్టి క్రమాన్ని వివరించినవాడే "శంభుడు''.

పినాకి : చతుర్వేదాలయందు శబ్దబ్రహ్మలా తేజరిల్లేవాడే"పినాకి''.

స్థాణు : పరిపూర్ణ నిష్కామునిగా, సమాధిస్థితిలో నిమగ్నమై జగత్కల్యాణ కాంక్షతో తపస్సు చేసేవాడే "స్థాణుడు''.

భర్గ : క్షీరసాగరమధనవేళ జనించిన హాలాహలాన్ని తన కంఠమునందు నిలిపి గరళకంఠుగా ప్రఖ్యాతి నొందినవాడే "భర్గుడు''.

గిరీశ : కైలాసగిరిపై పార్వతీదేవితో కొలువై భక్తుల కోర్కెలుతీర్చేవాడే "గిరీశుడు''.

సదాశివ : నిరాకార పరబ్రహ్మగా, సర్వరూపాత్మకంగాక్ శుభస్వరూపంగా సకల లోకాలను పాలించేవాడే "సదాశివుడు''.

హర : సర్పాలంకార భూషితుడై, ధనుస్సును ధరించి పాపాలను హరించేవాడే "హరుడు''.

శర్వ : ఇంద్రచాపాన్ని ధరించి, పృధ్వీరధికుడై, త్రిపురాసురసంహారం చేసినవాడే "శర్వుడు''.

కపాలి : దాక్షాయణీ వియోగంతో క్రోధతామ్రాక్షుడై దక్షయజ్ఞ ధ్వంసం చేసియన్ శూలపాణే, "కపాలి''.

భవ : రురు, దధీచి, అగస్త్య, ఉపమన్యుడు మొదలైన భక్తులకు యోగశాస్త్రాన్ని బోధించిన ఆదిగురువే "భవుడు''.

ఇలా ఏకాదశరుద్రులుగా లోకహితం కోరే పరమేశ్వరుడు అష్టమూర్తిగా విశ్వసంరక్షణ చేస్తూంటాడని శివపురాణం చెబుతుంది."శర్వుడు''గా జీవుల మనుగడకోసం భూమిని అధిష్టించి -"భవుడు''గా జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి -"రుద్రుడు''గా దుఃఖనివారకుడైన అగ్నిని అధిష్టించి -"ఉగ్రుడు'గా జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి-"భీముడు''గా గ్రహనక్షత్ర మండలాలకు ఆధారం కలిగించడానికి ఆకాశాన్ని ఆశ్రయించి -"పశుపతి''గా జీవులను కర్మపాశ విముక్తులను గావించడానికి జీవాత్మను అధిష్టించి -"ఈశానుడు''గా ఈ చరాచర జీవులకు ప్రాణశక్తిగా, సూర్యుని అధిష్టించి -"మహాదేవుడు''గా తన శీతల కిరణాలలో ఓషధీరూపంతో జీవులను పాలించే చంద్రుని అధిష్టించి -లోకపాలన చేసే పరమేశ్వరుని అనంత కళ్యాణ గుణగణాలను వర్ణించి, విశ్లేషించి, వివరించడానకి వేదాలకే సాధ్యంకాదు. ఇక మనమెంత.ఇంతటి మహోన్నత చరిత్రుడు కనుకనే జగజ్జనని అయిన పార్వతి, పరమేశ్వరుని వలచింది. ఆయనను భర్తగా పొందాలని తహతహలాడింది."అపర్ణ''యై పంచాగ్నిమధ్యంలో తపస్సు చేసింది. తత్ ఫలితంగా ఆ జగత్పితను వరించింది. శివనామ భాగయై వినుతికెక్కింది

No comments:

Post a Comment