MAAGHA PURANAM -- 3

మాఘపురాణం - 3వ అధ్యాయము
వింధ్య పర్వతము:
దిలీపుని మాటలకు వశిష్ఠుడు మరల ఇట్లు చెప్పదొడంగెను. భూపాలా! నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు. త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు, చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యములు గాని, దేవతార్చనలు గాని, చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకోను మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదలి వలస పోవుచుంటిరి. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవానదీ తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరులేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుట లేదు.
మహా తపస్వియగు భృగుమహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేక పోయాడు. ఎన్నో సంవత్సరాలనుండి ఆ ప్రాంతమందుండుటవలన అచటినుండి కదలుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధిలేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు.
హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచరియ వున్నది. ఆ కొండచరియ అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా వున్నది. అది తెల్లగా కూడా వున్నది. ఆ కొండచరియయందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తున్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండవద్దకు వచ్చి శ్రీమన్నారాయణు భక్తిభావముతో ప్రార్థించిరి. అంతియేగాక ఆ పర్వతమువద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు” అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అంతట దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను.
“ఓ మహానుభావా! ఆ పర్వతమును గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగజేసినవి. ఇంకను విశేషములున్న తెలుపగోరెదను” అని ప్రార్థించెను.
మరల వశిష్ఠులవారు ఇట్లు చెప్పిరి. “రాజా! నీయభీష్టం ప్రకారమే వివరింతును. సావధానుడవై ఆలకింపుము.
“ ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్య మృగములు, అనేక రకముల పక్షులతో నున్న ఆ అప్ర్వటం ముప్పది యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలదియై అలవారుచుండెను. అటువంటి పర్వతం వద్దకు భృగుమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూచి సంతోషించాడు. తాను తపస్సు చేసుకొనుటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకొనుచుండెను” అట్లు కొంతకాలం గడచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.
గంధర్వ యువకుని వృత్తాంతము:
“భృగుమహర్షీ! నా కష్టమును ఏమని విన్నవింతును? నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించిననూ పులిమొగం నాకు కలిగినది. ఏ కారణంచే నాకు అటుల కలిగెనో బోధపడకున్నది. ఆమె ణా భార్య అతిరూపవతి, గుణవంతురాలు మాహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడనైతిని. గాన ణా యీ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాదను తొలగింపజేయుడు” అని పరిపరి విధముల ప్రార్థించెను. భృగుమహర్షి గంధర్వుని దీనాలాపము నాలకించెను. ఆతని వృత్తాంతము వినగానే ముని హృదయము కలచివేసినట్లయింది. ఆ గంధర్వుని కెటులైనను తన శక్తికొలది సాయము చేయవలయునని నిశ్చయించుకొని ఇట్లనెను.
“ఓయీ గాంధర్వ కుమారా! నీవు అదృష్టహీనుడవు. అదృష్ట హీనత వలననే నీకీ కష్టదశ కలిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అను మూడునూ మనుజుని కృంగదీయును. ఈ మూడింటినీ నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమపావనమైన మార్గం. గావున నీవు నీ భార్యతో గూడ పర్వతం నుండీ ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదియునుగాక యిది మాఘమాసము గదా! వెళ్ళబోయిన తీర్థమెదురైనట్లు అన్నియు సమకూడుతున్నవి. ఈరోజుతో నీ కష్టములు తొలగిపోవును. నీ మనోవాంఛ యీడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను.
ఆ గంధర్వుడు భృగుమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరుని వచనములాలకించి సంతోషించెను. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై ఆదాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసెను. వెంటనే తనకున్న పెద్దపులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను. ఆ గాంధర్వ దంపతులు అమితానందం నొందిరి.
అంత వారిద్దరూ భృగుమహర్షి కడకువచ్చి సాష్టాంగ నమస్కారము చేసిరి. భృగువు వారలను దీవించి పంపివైచెను.
ఈవిధంగా గంధర్వ యువకుని చరిత్రమును వశిష్ఠులవారు దిలీపునకెరిగించి, “వింటివా రాజా! గంధర్వ కుమారుని వృత్తాంతం? మాఘమాసములో పుణ్యనదులయందు స్నానమాచరించిన యెడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకొనుము.

No comments:

Post a Comment